Namburi Sankar Rao Vs Bhashyam Praveen in Pedakurapadu: టీడీపీ విడుదల చేసిన అభ్యర్ధుల రెండో జాబితాలో పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ట్విస్ట్ ఇచ్చింది అధిష్టానం. ఒకే వర్గం నేతలు ఎన్నికల బరిలో పోటీపడటం కామనే.. అలాగే ఒకే కుటుంబసభ్యులు వేర్వేరు పార్టీల నుంచి వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీ చేయడం కూడా చూస్తూనే ఉన్నాం.. అయితే పెదకూరపాడులో టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యేని మార్చి కొత్త కేండెట్కు టికెట్ ఇచ్చింది టీడీపీ.. ఆ అభ్యర్ధి అక్కడి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి సమీపబంధువు అవ్వడం ఆసక్తికరంగా మారింది.. ఆ క్రమంలో అక్కడ మామాఅల్లుళ్ల పోరు యావత్తు గుంటూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఇటు వైసీపీ, అటు టీడీపీ అభ్యర్ధులను ఖరారు చేశాయి. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లో సీట్లు కన్ఫామ్ అయిన నేతలు ప్రచారంలో దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం ఇప్పటికే రెండు మూడు సార్లు నియోజకవర్గాన్ని చుట్టి వచ్చారు. ఆ క్రమంలో జిల్లాలోని పెదకూరపాడులో టీడీపీ ఇంట్రస్టింగ్ ట్విస్ట్ ఇచ్చింది.. పెదకూరపాడు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట లాంటిదని చెప్పవచ్చు.. అయతే గత ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు ప్రత్యర్ధులుగా పోటీ చేయడంతో .. ఓట్ల చీలిక కలిసొచ్చి.. పెదకూరపాడు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి నంబూరి శంకర్రావు గెలుపొందారు.
పెదకూరపాడు టీడీపీ టిక్కెట్ ను మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఆశించారు. గత నెలలోనే గుంటూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆయన వర్గం మీటింగ్ పెట్టుకుని.. పెదకూరపాడు టికెట్ కొమ్మాలపాటికి ఇవ్వాలని తీర్మానం చేసి అధిష్టానానికి పంపారు. శ్రీధర్ బాబు నియోజకవర్గంలో ఎవరికీ అందుబాటులో ఉండరన్న టాక్ ఉంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ పెదకూరపాడులో నిర్వహించిన కార్యక్రమానికి మంచి మైలేజే వచ్చింది.
Also Read: రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన జగన్ను తరిమేయాలి.. ప్రజాగళం సభలో పవన్ కళ్యాణ్ పిలుపు..
ఈసారి టీడీపీ టికెట్ రేసులోకి బాష్యం ప్రవీణ్ దూసుకొచ్చారు. బాష్యం ప్రవీణ్ మొదటగా చిలకలూరిపేట నుంచి టికెట్ ఆశించినప్పటికీ .. అక్కడ మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తిరిగి పోటీ చేయడం ఖాయమవ్వడంతో .. పెదకూరపాడు నియోజకవర్గంలో కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా, నియోజవర్గ సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తూ టీడీపీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. సెగ్మెంట్లో తన ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ట్రై సైకిళ్లు, తోపుడు బళ్ల పంపిణీలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఆ క్రమంలో టీడీపీ ప్రకటించిన రెండో జాబితాలో బాష్యం ప్రవీణ్కి టీడీపీ టికెట్ కన్ఫర్మ్ అయింది. వైసీపీ తరపున ఇప్పుడు నిలబడబోతున్న ఎమ్మెల్యే శంకర్ రావు, తాజాగా టీడీపీ నుంచి టికెట్ పొందిన భాష్యం ప్రవీణ్ కి వరుసకు మామా అల్లుళ్లు అవుతారు. ఇద్దరిదీ కూడా తాడికొండ మండలం పెదపరిమినే. మామ అల్లుళ్ల మధ్య జరగనున్న ఫైట్ ఇప్పుడు ఆసక్తికరంగా తయారైంది. వారి మధ్య పోరు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే చర్చనీయంగా మారింది. మొన్నటి వరకు ఇన్చార్జిగా ఉన్న కొమ్మలపాటి శ్రీధర్ కి టికెట్ ఇచ్చి ఉంటే అటు టీడీపీ, వైసీపీల మధ్య పోటీ ఎలా ఉండేదో కానీ.. ఇప్పుడు ప్రవీణ్ బరిలోకి దిగడంతో.. నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న వారి బంధుగణం, కులసమీకరణలు ఎవరికి అనుకూలంగా ఉంటాయన్న చర్చ మొదలైంది.
2009లో టీడీపీలో చేరిన కొమ్మాలపాటి శ్రీధర్.. పెదకూరపాడు నుంచి పోటీ చేశారు. ఆర్థికంగా అక్కడ బలంగా ఉండటంతో పాటు, అప్పుడు జరిగిన ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ గుంటూరుకు వెస్ట్ నియోజకవర్గానికి ఛేంజ్ అవడంతో శ్రీధర్ ఈజీగానే విజయాన్ని సాధించారు. ఆ తర్వాత 2014లోనూ అదే జోరును కంటిన్యూ చేస్తూ.. రెండోసారీ విజయం సాధించారు. అయితే ముచ్చటగా మూడోసారి 2019లో బరిలోకి దిగిన కొమ్మాలపాటి.. వైసీపీ అభ్యర్థి నంబూరి శంకర్ రావు చేతిలో ఓటమిపాలయ్యారు.
Also Read: అలుపెరగని నేతలు.. ఏపీ ఎన్నికల బరిలో పదోసారి పోటీ..!
అయితే పెదకూరపాడులో అన్నిరకాలుగా బలంగా ఉన్న నంబూరు శంకర్ రావును ఢీకొట్టడానికి కొమ్మాలపాటి సరిపొరని టీడీపీ భావించినట్లు కనిపిస్తోంది. నంబూరిని డీకొట్టడానికి భాష్యం ప్రవీణే అక్కడ బలమైన అభ్యర్థి అవుతారని నియోజకవర్గంలో కథ కొద్ది రోజులుగా కూడా భారీ ప్రచారమే నడిచింది. నారా లోకేష్ కు సన్నిహితుడిగా ఉన్న భాష్యం ప్రవీణ్.. భాష్యం ప్రవీణ్ భాష్యం ట్రస్టు ద్వారా సామాజిక కార్యక్రమాలు చేపడుతూ పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ తరఫున కూడా ప్రచారం చేస్తూ వచ్చారు.
భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు బరిలో నిలవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. వేరే నేత అయితే రాజకీయాలు ఒక రకంగా ఉంటాయి కానీ ఇద్దరు ఒకే కుటుంబం ఒకే సామాజికవర్గం అవ్వటంతో ఓట్ షేరింగ్ ఎలా ఉంటుందనేది అక్కడి ప్రజల్లో ఆసక్తి రేపుతోంది. నియోజకవర్గంలో కమ్మ సామాజి వర్గం ఓటు బ్యాంకు ప్రభావితంగా ఉంటుంది. ప్రత్యర్ధులు ఇద్దరూ అదే వర్గం అవ్వడంతో ఎవరు ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకుంటారనేది చర్చల్లో నలుగుతోంది.
ఎమ్మెల్యే గా ఉన్న నంబూరి శంకర్రావు తాను ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, అందించిన సంక్షేమ ఫలాలే తనను గెలిపిస్తాయన్న ధీమాతో కనిపిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తన విజనరీ తాను చేసినటువంటి సేవా కార్యక్రమాలు, ప్రభుత్వంపై వ్యతిరేకత, జనసైనికుల సహకారం తన విజయానికి బాట వేస్తాయంటున్నారు. ఇక ఇప్పుడు చూడాలి ఈ మామా-అల్లుళ్ల మాటల యుద్దం ఎలా ఉండబోతుందో?