Hail Showers in Telangana: తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆదివారం ఉదయం నుంచి మబ్బులు కమ్ముకున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వానలు కురిశాయి. మరో నాలుగు రోజులు రాష్ట్రంలో వడగండ్ల వానలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగండ్ల వర్షాలతో పాటు, ఉరుములు, మెరుపులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.
వర్షాల హెచ్చరికల నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావారణశాఖ. మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, జోగులాంబ గద్వాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధ, గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.
Also Read: వాసన భరించలేకపోయినా.. చెమట మంచిదే!
ఆదివారం ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వడగండ్ల వర్షం కురిసినట్లు తెలిపింది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా నాగలగిద్దలో 3.4 సెంటీమీటర్ల వర్షం కురవగా.. కంగ్టిలో 2.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వడగండ్ల వానలతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి.
నిజామాబాద్ జిల్లాలో కురిసిన వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. మక్క, వరి, మామిడి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. కామారెడ్డి జిల్లాలో 20 వేల ఎకరాలకు పైగా వరి, మక్క, జొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. 16,450 ఎకరాల్లో వరి, 3,621 ఎకరాల్లో మక్క, 163 ఎకరాల్లో మామిడి, 600 ఎకరాల్లో జొన్న, 50 ఎకరాలలో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి.
దేశవ్యాప్తంగా నాలుగురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన భారత వాతావరణ శాఖ రైతులకు పలు సూచనలు చేసింది. మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్ గఢ్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని రైతులు పండ్లు, కూరగాయల పంటలను రక్షించుకునేలా నెట్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.