Politicians That 10th Time contesting in AP Elections 2024: రాజకీయాల్లో నిలవాలంటే దమ్మూ ధైర్యమే కాదు, డబ్బులుండాలి, వీటన్నింటికీ మించి వయసు సహకరించాలి. లేదంటే కథ కంచికి వెళ్లిపోతుంది. ఆ కథను కంచికి చేరకుండా తెలుగు టీవీ సీరియల్ లాగా కొనసాగిస్తూ వరుసగా పోటీ చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. వారిలో ముగ్గురికి ఇది పదో ఎలక్షన్ కావడం విశేషం. ఎన్నిసార్లు, ఎన్ని గెలిచారనేది పక్కన పెడితే… ఆ ముగ్గురు మొనగాళ్లు ఎవరంటే తమ్మినేని సీతారం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గొల్లపల్లి సూర్యారావులు ఉన్నారు.
వీరిలో ఒక కామన్ ట్విస్ట్ ఉంది…వీరు ముగ్గురూ వైసీపీ నుంచే పోటీ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నుంచి తమ్మినేని సీతారం, చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నుంచి గొల్లపల్లి సూర్యారావులు ఎన్నికల బరిలో పోటీ పడుతున్నారు.
యువకులకన్నా స్పీడుగా, రెట్టించిన ఉత్సాహంతో మండుటెండలను సైతం లెక్క చేయకుండా, ఎన్నికల ప్రచారాల్లో అపరిమితమైన అనుభవంతో చకచకా తిరిగేస్తున్నారు. ఉదయం ప్రచారాలు, సాయంత్రమైతే సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు.
Also Read: New Vote Registration : ఓటు నమోదుకు మరో అవకాశం.. ఏప్రిల్ 15 వరకు గడువు..
ఇక వీరి తర్వాత 9వ సారి బరిలో ఉన్నవారు విజయనగరం బరిలో నిలుస్తున్న కోలగట్ల వీరభద్రస్వామి, వైఎస్సార్ జిల్లా మైదుకూరు అభ్యర్థి శెట్టిపల్లి రఘురామిరెడ్డి, నెల్లూరు జిల్లా కోవూరు అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కర్నూలు జిల్లా పాణ్యం నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. ఎనిమిదోసారి పోటీలో ఉన్నవారిలో మండపేట అభ్యర్థి తోట త్రిమూర్తులు, శ్రీకాకుళం అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు, పీలేరు అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు.
ఏడోసారి పోటీ పడుతున్నవారిలో తాడేపల్లిగూడెం అభ్యర్థి కొట్టు సత్యనారాయణ, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అభ్యర్థి వరుపుల సుబ్బారావు, ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, అమలాపురం అభ్యర్థి పినిపే విశ్వరూప్ ఉన్నారు. ఆరోసారి పోటీపడుతున్నవారిలో నరసన్నపేట నుంచి ధర్మాన క్రష్ణ ప్రసాద్, నూజివీడు నుంచి మేకా ప్రతాప్ ఉన్నారు. మరి ఈ అలుపెరగని వీరులందరూ విజయం సాధిస్తారా? విజయ పతాకం ఎగురవేస్తారా? అనేది ఎన్నికల ఫలితాల వరకు ఎదురుచూడాల్సిందే.