Family Politics In YCP(Latest political news in Andhra Pradesh): ఏపీ రాజకీయాల్లో కుటుంబ పాలన పలుచోట్ల కనిపిస్తోంది. వాళ్లలో వారే సీట్లు పంచేసుకున్నారు. సీఎం జగన్ కి సన్నిహితులుగా మెలుగుతూ ఒకొక్కరు రెండేసీ, మూడేసి సీట్లు కొట్టేశారు. వారిలో తండ్రీ కొడుకులు ఉన్నారు. భార్యాభర్తలు ఉన్నారు. అన్నదమ్ములు, బాబాయ్- అబ్బాయ్ లు ఒకే పార్టీ నుంచి వివిధ స్థానాల్లో పోటీలు పడుతున్నారు.
మచిలీపట్నంలో పేర్నినాని అందరికీ తెలిసిన పేరే. వైసీపీ తరఫున మాట్లాడే ఐదుగురు ప్రధాన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. కౌంటర్లు బాగా వేయడంలో దిట్ట. ఇప్పుడాయన కుమారుడు పేర్ని కిట్టు బరిలో నిలుస్తున్నారు. తిరుపతిలో టీటీడీ ఛైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి నిలుచున్నారు. ఇక సీఎం జగన్ కి కుడి భుజంగా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అవకాశం దక్కింది.
అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ కోడలు చెట్టి తనూజా రాణికి అరకు లోక్ సభ స్థానం కేటాయించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే షేక్ ముస్తాఫా కుమార్తె షేక్ నూరీ ఫాతిమాకు టికెట్ దక్కింది. చీరాల సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరామ క్రష్ణమూర్తి కుమారుడు కరణం వెంకటేష్ కు అదే స్థానం కేటాయించారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానంలో ఆయన సతీమణి తెల్లం రాజ్యలక్ష్మి పోటీ పడుతున్నారు. ఇక గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం కె.నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మికి సీటు దక్కింది.
ఇవి కాకుండా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురికి సీట్లు ఇచ్చే సంప్రదాయాన్ని సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. మరే ప్రాతిపదికన ఇచ్చారో తెలీదు. నాడు వైఎస్ హయాంలో కూడా బొత్సా ఝాన్సీరాణి, బొత్సా సత్యనారాయణ ఇద్దరూ బరిలో నిలిచారు. మళ్లీ ఇప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి, బొత్స ఝాన్సీ విశాఖ లోక్ సభ స్థానం నుంచి, ఆయన సోదరుడు బొత్స అప్పలనరసయ్య గజపతి నగరం నుంచి పోటీ చేయనున్నారు. మంత్రి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా, ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తంబళ్ల పల్లె నుంచి పోటీ చేస్తున్నారు.
Also Read: ఒకే వేదికపైకి మోదీ, బాబు, పవన్.. నేడు చిలకలూరిపేటలో బహిరంగ సభ
ఇక అందరికీ తెలిసిన అన్నదమ్ములు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన క్రష్ణదాసు శ్రీకాకుళం, నరసన్న పేటల నుంచి పోటీ పడుతున్నారు. వై. బాలనాగిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి ముగ్గురు అన్నదమ్ములు కూడా వరుసగా మంత్రాలయం, గుంతకల్లు, ఆదోనీల నుంచి పోటీ చేయనున్నారు. ఆదిమూలపు సురేష్, సతీష్ లు వరుసగా కొండపి, కోడుమూరు బరిలో ఉన్నారు.
చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తుంటే, కుమారుడు మోహిత్ రెడ్డి చంద్రగిరి నుంచి చేస్తున్నారు. కారుమూరి నాగేశ్వరరావు తణుకు ఎమ్మెల్యేగా, కుమారుడు సునీల్ కుమార్ ఏలూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. బాబాయ్ అబ్బాయ్ కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలకు తాడిపత్రి, ధర్మవరం టిక్కెట్లు లభించాయి. మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు నుంచి, ఆయన బాబాయ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి నుంచి పోటీ చేస్తున్నారు.