BRS MLC Kavitha Arrest Updates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తోంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ప్రధాన కుట్రదారుల్లో ఆమె కూడా ఒకరిని నిర్ధారించింది. కవిత కింగ్ పిన్ గా వ్యవహరించారని పేర్కొంది. భారీగా లబ్ధి కూడా పొందారని తేల్చింది. ఢిల్లీ మద్యం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ. 100 కోట్ల లంచం ఇచ్చారని వివరించింది. అలాగే దాదాపు రూ. 192 కోట్లు కవిత అక్రమంగా ఆర్జించారని వెల్లడించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ అనేక విషయాలను పొందుపర్చింది. సౌత్ గ్రూపునకు చెందిన కల్వకుంట్ల కవిత, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాగుంట రాఘవరెడ్డి ఆప్ నాయకులతో కలిసి కుట్ర చేశారని పేర్కొంది.
మద్యం పాలసీని తమకు అనుకూలంగా తయారు చేసేందుకు ఆప్ నేతలకు రూ. 100 కోట్లు ఇచ్చారని ఈడీ ఆరోపించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆ సమయంలో డిప్యూటీ సీఎంగా ఉన్న మనీశ్ సిసోడియాతో మధ్యవర్తుల ద్వారా కల్వకంట్ల కవిత టీమ్ అవగాహన కుదర్చుకుందని తెలిపింది.
Also Read: వారం రోజులు ఈడీ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశం..
ఆప్ లీడర్స్ కు లంచం ఇచ్చిన తర్వాత కల్వకుంట్ల కవితకు అనుకూలంగా మద్యం పాలసీని రూపొందించారని ఈడీ తెలిపింది. అరుణ్ రామచంద్ర పిళ్లైని కవిత బినామీగా పేర్కొంది. ఆయన ఇండోస్పిరిట్ లో ఎలాంటి పెట్టుబడి పెట్ట లేదని నిర్ధారించింది. కానీ లిక్కర్ ప్రొడక్షన్ లో పేరుగాంచిన పెర్నాడ్ రికార్డ్ సంస్థలో డిస్ట్రిబ్యూషన్ దక్కించుకున్నారని తెలిపింది. 2021-22 ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఇండో స్పిరిట్ ఎల్ 1 గా నిలిచింది. భారీగా లాభాలు కూడగట్టిందని ఈడీ వెల్లడించింది.
సౌత్ గ్రూపునకు లాభం చేకూర్చేలా లిక్కర్ పాలసీలో మార్పులు చేశారని ఈడీ ఆరోపించింది. హోల్ సేలర్ల లాభాల వాటాను 12 శాతానికి పెంచారని తెలిపింది. అందులో నుంచే ఆప్ నాయకులు డబ్బులు అందాయని నిర్ధారించింది. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మనీలాండరింగ్ కు పాల్పడ్డారని తేల్చిన తర్వాత అరెస్ట్ చేశామని ఈడీ స్పష్టం చేసింది.