TDP – BJP – Jansena Praja Galam at Chilakaluripet in Andhra Pradesh: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రోజే ఏపీలో భారీ బహిరంగ సభ జరగబోతోంది. పదేళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒకే వేదికపైకి రాబోతున్నారు. చిలకలూరిపేటలో నిర్వహించే ఈ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ తరఫున 10 లక్షల మంది కార్యకర్తలు తరలివస్తారని అంచనా వేస్తున్నారు.
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరిన తర్వాత జరగనున్న తొలి సభ ఇదే. అంతకుముందు టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించారు. చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో టీడీపీ, జనసేన , బీజేపీ కలిసి ప్రజాగళం పేరుతో నేడు బహిరంగ సభ నిర్వహించనున్నాయి.
2014 ఎన్నికల సమయంలో గుంటూరు సభలో మోదీ, చంద్రబాబు, జనసేనాని ఒకే వేదికపై ఎన్నికల ప్రచారంలో కనిపించారు. ఆ తర్వాత ఈ రోజు మళ్లీ ఆ దృశ్యం ఆవిష్కతం కాబోతోంది. 2019 ఎన్నికల్లో ఓడిన టీడీపీ ఈసారి అధికారమే లక్ష్యంగా పావులు కుదుపుతోంది. ఈ నేపథ్యంలోనే జనసేన, బీజేపీలతో పొత్తు కుదుర్చుకుంది. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలను చంద్రబాబు ప్రకటించారు. చిలకలూరిపేట వేదికగా ఏపీ భవిష్యత్తు కోసం ఏం చేయబోతున్నామో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సందేమివ్వనున్నారు.
Also Read: పదేళ్లకు ఏపీ భవన్ విభజన పూర్తి.. కేంద్రం ఆమోదం..
ప్రజాగళం ప్రధాన వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సహా ముఖ్యనేతలు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మరో వేదికను సాంస్కృతిక ప్రదర్శనల కోసం ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై మొత్తం 30 మంది కూర్చునేందుకు అనుమతి ఇచ్చారు. మోదీ, బాబు, పవన్ కాకుండా ప్రతి పార్టీ నుంచి 9 మందికి అవకాశం కల్పించనున్నారు.
ఆదివారం సాయంత్ర ఐదున్నర గంటల సమయంలో మోదీ సభా ప్రాంగణానికి వస్తారు. దాదాపు గంటపాటు సభా వేదికపై ఉంటారు. మొత్తం 300 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చేవారు కుర్చునేందుకు 24 గ్యాలరీలను రూపొందించారు. 20 ఎల్ఈడీ స్క్రీన్లు అమర్చారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్ఎస్జీ బృందం శనివారమే సభా ప్రాంగాన్ని ఆధీనంలోకి తీసుకుంది. మొత్తం 5 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు.