CM Revanth Reddy Speech In Vizag : విశాఖలో నిర్వహించిన కాంగ్రెస్ న్యాయ సాధన బహిరంగ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నించడాన్ని తప్పుపట్టారు. ఢిల్లీ నుంచి ఎవరొచ్చినా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ పరిధి నుంచి ఇంచు కూడా కదలించలేరని స్పష్టంచేశారు. తెలుగువారి హక్కుల కోసం పోరాడదామని పిలుపునిచ్చారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మోదీ పక్షానే ఉన్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
ప్రశ్నించే నాయకులు లేకపోవడం వల్లే ఏపీని ప్రధాని మోదీ పట్టించుకోవడంలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి కావాల్సింది సాధించే నాయకత్వంలో ఏపీలో లేదన్నారు. కేంద్ర సహకారం లేకపోవడం వల్లే రాష్ట్రం విడిపోయి పదేళ్లైనా ఏపీలో రాజధాని నిర్మించుకోలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదన్నారు.
ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముందుకొచ్చారని రేవంత్ రెడ్డి తెలిపారు. అందరం కలిసి పోరాడి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరంగా కాకుండా కాపాడుకుందామన్నారు. పాలించే నాయకులు కాదు .. ప్రశ్నించే నేతలు కావాలన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నదే వైఎస్ఆర్ ఆశయమని చెప్పారు. విశాఖ సభను చూస్తుంటే హైదరాబాద్ లో సభ జరుగుతుందా అన్నట్లు ఉందన్నారు.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఒకేరోజు పోలింగ్.. జూన్ 4న ఫలితాలు..
బీజేపీ అంటే బాబు, జగన్ , పవన్ అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ ముగ్గురు నాయుకులే మోదీ బలగం మని.. కానీ ఏపీ ప్రజల కోసం పోరాడుతున్న నాయకురాలు షర్మిల అని పేర్కొన్నారు. కాంగ్రెస్ తరఫున 25 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలను గెలిపించాలని పిలుపునిచ్చారు. వారు చట్ట సభల్లో ఏపీ కోసం పోరాటం చేస్తారని చెప్పారు.
ఏపీ సీఎం జగన్ పై షర్మిల ఫైర్ అయ్యారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం జగన్ ఎందుకు ఉద్యమం చేయలేదని నిలదీశారు. 30 వేల మంది స్టీల్ ప్లాంట్ కార్మికుల పరిస్థితేంటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని కోసం కేంద్రాన్ని ఏపీలోని అధికార పక్షం, విపక్షం రెండూ కూడా ప్రశ్నించవని మండిపడ్డారు. సిద్ధం సభలకు వైఎస్ జగన్ 600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.