AP Telangana Elections 2024 : ఏపీ, తెలంగాణలో ఒకేరోజు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 13న నిర్వహించనున్నారు. ఏపీ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఏప్రిల్ 25 వరకు నామినేషన్లకు గడువు ఇచ్చారు. ఏప్రిల్ 26న నామినేషన్లు పరిశీలిస్తారు. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.
ఏపీలో మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. జూన్ 16లోపు ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కొద్దిగంటలకు ముందే 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అలాగే 24 మంది లోక్ సభ అభ్యర్థుల పేర్లను వెల్లడించారు.
వైసీపీ ఇప్పటికే సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తోంది. ఇలా ఎన్నికల ప్రచారం చేపట్టిన జగన్ అభ్యర్థుల పేర్లను ప్రకటించి పూర్తిగా ఎన్నికలకు సిద్ధమయ్యారు. సరిగ్గా ఎన్నికలకు 57 రోజుల సమయం ఉంది. అంటే ప్రచారానికి 56 రోజులు ఉంది. ఇక ఏపీలో ప్రచారం జోరుగా సాగనుంది.
Also Read : విడతల్లో సార్వత్రిక ఎన్నికలు.. ఏపీలో మే 13న పోలింగ్..
మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేయనుంది. జనసేన 21 సీట్లలో బరిలోకి దిగనుంది. బీజేపీ 10 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేయనుంది. టీడీపీ 17 లోక్ సభ స్థానాల్లో , బీజేపీ 6 స్థానాల్లో, జనసేన రెండు చోట్ల బరిలోకి దిగనుంది.
ఇటు తెలంగాణలో మే 13నే పోలింగ్ జరగనుంది. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ముక్కోణపు పోరు జరగనుంది. ఇప్పటికే మూడు పార్టీలు కొంతమంది అభ్యర్థులను ప్రకటించాయి. అలాగే ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో ఖాళీ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి మే 13నే పోలింగ్ జరగనుంది.
తెలంగాణలో ప్రచారం పర్వం మొదలైంది. కాంగ్రెస్ ప్రజా దీవెన బహిరంగ సభలు నిర్వహిస్తోంది. అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం చేపట్టారు. అటు బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేసింది. ఇప్పటికే ప్రధాని మోదీ మల్కాజ్ గిరి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు.