CM Revanth Reaction On Kavithas Arrest: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేపటికి 100 రోజులు పూర్తి కానున్న సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎంతో పాటుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలతో పాటుగా పలు శాఖలు అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ ఎత్తుగడల్లో భాగంగానే ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిందని ఆరోపించారు. కవితను అరెస్ట్ చేయడం ద్వారా రాష్ట్రంలో ఆ క్రెడిన్ ను ఈ రెండు పార్టీలు పొందాలనుకుంటున్నాయన్నారు. కవితను అరెస్ట్ చేస్తే తండ్రిగా కాకపోయినా పార్టీ అధ్యక్షుడిగానైనా కేసీఆర్ స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు.
Also Read: Kavitha Arrest Update : రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచిన ఈడీ.. వాదనలు వినిపిస్తున్న లాయర్లు
కవిత అరెస్ట్ పై కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 12 సీట్లు వస్తాయని అన్ని సర్వేలు అంచసా వేశాయని.. బీఆర్ఎస్, బీజేపీలు ఓడిపోతామనే భయంతోనే ఈ ఛీప్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. ఇకనైనా ఈ పార్టీలు డ్రామాలకు తెరలేపాలని కోరారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని పడగొడతా అంటున్నారని.. అయితే వారు ప్రభుత్వాన్ని పడగొట్టే పనిలో ఉంటే తాను ప్రభుత్వాన్ని నిలబెట్టే పనిలో ఉంటానని వెల్లడించారు. గతంలో రాష్ట్రానికి ఈడీ అధికారులు వచ్చిన తర్వాత మోదీ వచ్చేవారని.. అయితే నిన్న మాత్రం ఈడీ, మోడీ ఒకేసారి వచ్చారని విమర్శించారు.
తెలంగాణని అవమానంచిన మోదీకి ఇక్కడ ఓటు అడిగే హక్కు లేదన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ అంత అవినీతి చేస్తే మోదీ ప్రభుత్వం ఒక్క కేసు నమోదు చేయకపోవడం విడ్డురం అని పేర్కొన్నారు. ప్రధానిగా ఆయన చౌకబారు ప్రకటన చేయడం సరికాదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం అని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు మంచి చేసింది కాంగ్రెస్ పార్టీనేనని.. బంగారు లక్ష్మణ కుటుంబాన్ని బీజేపీ రోడ్డున పేడేసిందని ఆరోపించారు.