PM Modi Speech in Nagarkurnool Sabha ( latest political news) : తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే అడ్డుగా మారాయని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ రాష్ట్రంలో భారీ అవినీతికి పాల్పడిందన్నారు. నాగర్ కర్నూల్ లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని.. తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. నిన్న జరిగిన మల్కాజ్ గిరి రోడ్ షో కు అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. జరగబోయే ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లలో విజయం సాధించి.. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ గేట్ ఆఫ్ సౌత్ అని, తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వమే కృషి చేసిందన్నారు. పేదల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని.. మార్పుకు ఇచ్చే ఒకే ఒక్క గ్యారెంటీ మోదీ గ్యారెంటీ అని తెలిపారు. ఎన్డీయే హయాంలో జరిగిన అభివృద్ధితో 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారన్నారు. గరీబ్ హఠావో నినాదమైతే ఇచ్చారు కానీ.. అందుకు కృషి చేయలేదని గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ భారీ అవినీతికి పాల్పడిందని, ఆ పార్టీలో ప్రజలకు ఎంత కోపం ఉందో తాను చూశానన్నారు.
Also Read : నేడే ఎన్నికల షెడ్యూల్.. మధ్యాహ్నం 3 గంటలకు ఈసీ ప్రకటన
140 కోట్ల మంది ప్రజలే తన కుటుంబమన్నారు ప్రధాని. దళితబంధు పేరుతో బీఆర్ఎస్ దళితులను మోసం చేస్తే.. దళిత మహిళను ఎన్డీయే సర్కార్ రాష్ట్రపతిని చేసిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బడుగు, బలహీన వర్గాలను మోసం చేశాయని, బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ అడుగుజాడల్లో నడుస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ 2జీ స్కాం చేస్తే.. బీఆర్ఎస్ ప్రాజెక్టులతో దోచుకుంటోందని ఎద్దేవా చేశారు. దళితుడిని తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తామన్న కేసీఆర్.. ఇచ్చిన మాట తప్పారన్నారు. ఎన్డీయే హయాంలో 87 లక్షల మంది ఆయుష్మాన్ భారత్ తో లబ్ధిపొందారని తెలిపారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసిన ఏకైక ప్రభుత్వం బీజేపీనే అని పేర్కొన్నారు.
మరికొద్దిసేపటిలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానుందని, దానికంటే ముందే ప్రజలు ఎవరికి ఓటెయ్యాలో డిసైడ్ అయ్యారని మోదీ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో బీజేపీని గెలిపించాలని మోదీ కోరారు.