Telangana Weather Update Today : ఉదయం 9 గంటలైతే చాలు.. రోడ్డుమీదికి రావాలంటేనే జనం బెంబేలెత్తుతున్నారు. కానీ.. ఉద్యోగాలు, రోజువారి పనులు చేసుకునేవారికి బయటకు రావడం తప్పట్లేదు. పొట్టకూటి కోసం వెళ్లాలి కాబట్టి.. మండుటెండలో మాడిపోతూనే పనులు చేసుకుంటున్నారు. మండుటెండలకు తోడు తీవ్రమైన ఉక్కపోత ప్రజల్ని ఇబ్బంది పెడుతోంది. భానుడి భగభగలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను తాకాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది.
తెలంగాణలో నాలుగైదు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మార్చి 17 నుంచి 20 వరకూ రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ అంచనా ప్రకారం ఈ నాలుగు రోజులు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే కొండ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. హైదరాబాద్ లోనూ వాతావరణం కాస్త చల్లగా ఉంది. ఎండలతో అల్లాడిపోయిన ప్రజలు.. చల్లబడిన వాతావరణంతో సేదతీరుతున్నారు.
Also Read : మండుతున్న ఎండలు.. వేడిని ఇలా నివారించండి!
రాబోయే 72 గంటల్లో.. అంటే మార్చి 16 నుంచి 18 వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. కొన్నిప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం కూడా ఉందని పేర్కొంది. ఐఎండీ అంచనా ప్రకారం.. తూర్పు, మధ్య భారతదేశంలో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉంది. ఎండల తీవ్రత మున్ముందు పెరగనున్న నేపథ్యంలో రబీ పంటలు దెబ్బతినే అవకాశాలున్నట్లు తెలిపింది. కాగా.. శుక్రవారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 40.9 డిగ్రీలు, హైదరాబాద్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే పాటిగడ్డలో అత్యధికంగా 40.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది.