ED Produced Kavitha in Rouse Avenue Court(Breaking news in telangana): ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. శనివారం వైద్య పరీక్షల అనంతరం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. మెజిస్ట్రేల్ నాగపాల్ ఎదుట హాజరుపరిచిన ఈడీ.. కవితను 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరింది. కోర్టులో జడ్జి ముందుకు వెళ్లిన కవిత.. తనను చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారని, కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని వాపోయారు.
ఈడీ తరపున పీపీ ఎస్ కే మట్టా, జోసెఫ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తుండగా.. కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తున్నారు. కవితతో మాట్లాడేందుకు 5 నిమిషాలు అనుమతి కోరగా జడ్జి నాగపాల్ అందుకు అనుమతించారు. కవితతో మాట్లాడిన అనంతరం విక్రమ్ చౌదరి తన వాదనను కొనసాగిస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. రాత్రంతా ఈడీ ఆఫీసులోనే కూర్చోబెట్టారు. ఈడీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. కవితకు వైద్య పరీక్షలు పూర్తి కావడంతో.. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మరోవైపు.. తన అరెస్టును ఖండిస్తూ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కవిత అరెస్టుపై అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా ఆమె తరఫు లాయర్లు పేపర్లను సిద్ధం చేస్తున్నారు.
కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ కీలకనేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిలో శుక్రవారం ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు ప్రశాంతంగా జరిగాయని, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశామని ఈడీ (Enforcement Directorate) అధికారులు వెల్లడించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ పి. శ్రీనివాస్ రెడ్డి, బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ మేనేజర్ ఎద్దుల వివేకానందరెడ్డి ఎదుట వివరాలను సేకరించినట్లు వెల్లడించారు. సాయంత్రం 6.45 గంటలకు కవిత ఇంట్లో తనిఖీలను ముగించిన ఈడీ.. ఆ వెంటనే ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీ ఈడీ కార్యాలయానికి తరలించారు.
Also Read : గల్లీలో కొట్లాట.. ఢిల్లీలో దోస్తీ.. బీజేపీ, బీఆర్ఎస్పై కాంగ్రెస్ ఫైర్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కవిత అరెస్ట్ ఖాయమని జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలకు ముందు కవితను ఈడీ అరెస్ట్ చేయడంతో.. బీఆర్ఎస్ భారీ కుదుపునకు గురైంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమెకు పలుమార్లు ఈడీ నోటీసులిచ్చింది. విచారణకు రావాల్సిందేనని చెప్పగా.. ఒకసారి ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరయ్యారామె. కవిత అరెస్ట్, సీఎం రేవంత్ రెడ్డి ఇఫ్తార్ విందు, మల్కాజ్ గిరిలో ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచార రోడ్ షో.. ఒకేరోజు ఒకే సమయంలో జరిగాయి. కవిత అరెస్ట్ అవుతారని ఊహాగానాలు వచ్చినపుడు ఎలాంటి చర్య తీసుకోని ఈడీ.. తాజాగా ఊహించని విధంగా ఆమెను అరెస్ట్ చేయడం తెలంగాణలో సంచలనానికి దారితీసింది. కవిత అరెస్ట్ ప్రభావం తెలంగాణ లోక్ సభ ఎన్నికలపై ఉంటుందంటున్నారు రాజకీయవేత్తలు.
కవిత అరెస్టైందన్న విషయం తెలిసీ తెలియగానే.. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బంజారాహిల్స్ లో భారీ ఎత్తున నిరసనలకు దిగారు. కేంద్రానికీ, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేయనున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండగానే.. కవితను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ట్రాన్సిట్ వారెంట్ కూడా లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ అధికారుల్ని నిలదీశారు.