AP Chief Electoral Officer: మరో నెలరోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే సొంతంగా టీవీ ఛానెళ్లు కలిగి ఉండి తమ అభ్యర్థులకు అనుకూలంగా వాటిలో ప్రచారం చేస్తే దానికి అయ్యే ఖర్చును కూడా ఎన్నికల వ్యయంగా పరిణిస్తామని వెల్లడించారు. వీటిపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేల ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా పలు శాఖల అధికారులకు కీలక సూచనలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎన్నికల్లో ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆయా జిల్లాల ఎస్పీలపైనే ఉందని.. ఒకవేళ ఎక్కడైన ఇటువంటివి జరిగితే దానికి ఎస్పీలనే బాధ్యులన్ని చేస్తామన్నారు. ఆపై వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో పాటుగా రీ పోలింగ్ కు కూడా ఎక్కడా ఆస్కారం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. అలానే ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా రాజకీయ పార్టీలకు మద్దతుగా ప్రచారం చేయటం, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు.
రాజకీయ పార్టీలు టీవీ, డిజిటల్ మాధ్యమాల్లో ప్రటనల కోసం ఈసీ నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరి అని అన్నారు. ఆ ప్రకటనల్లో అభ్యంతకర అంశాలు ఉండకుంటా రాజకీయ పార్టీలు చూసుకోవాలన్నారు. ఇప్పటి వరకు వివిధ రాజకీయ పార్టీలనుంచి అనుమతుల కోసం 155 దరఖాస్తులు అందాయని వాటిపై నిరంతర నిఘా ఉంటుందని అన్నారు. లోక్సభకు పోటీచేసే అభ్యర్థులు రూ.95 లక్షలు, అసెంబ్లీకు పోటీచేసే వారికి రూ.40 లక్షల మేర ఖర్చు చేసేందుకు అనుమతి ఉందని తెలిపారు. అయితే సొంత టీవీ ఛానళ్లు ఉన్న రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు మద్దతుగా వారి ఛానళ్లలో ప్రచారం చేస్తే ఆ ఖర్చును ఎన్నికల వ్యయంగా పరిగణిస్తామని ముకేశ్కుమార్ మీనా రాజకీయ పార్టీలకు తెలిపారు. ఈ తరహా ప్రచారాలను మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) నిరంతరం పర్యవేక్షిస్తుందని అన్నారు.
‘ఆ ఖాతాల వివరాలు అందజేయండి’
బ్యాంకు ఖాతాల ద్వారా అధిక మొత్తంలో అనుమానస్పదంగా జరిగే లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు ఆదాయ పన్ను శాఖకు, ఎన్నికల సంఘానికి అందజేయాలని బ్యాంకర్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. 2023 అక్టోబరు 1 నుంచి రోజుకు రూ.10 లక్షలకు మించి, 30 రోజుల్లో రూ.50 లక్షలకు మించి లావాదేవీలు జరిపిన బ్యాంకు ఖాతాల వివరాలు వెంటనే అందజేయాలని కోరారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే అభ్యర్థులు, వారి సంబంధీకులు, రాజకీయ పార్టీల బ్యాంకు ఖాతాల నుంచి రూ.లక్షకు మించి జరిపే లావాదేవీల వివరాల తమకు ఇవ్వాలని కోరారు.
Also Read: YS Sunitha Reddy : జగన్.. “అంతఃకరణ శుద్ధిగా” అంటే అర్థమేంటో తెలుసా ? : సునీత
‘రాష్ట్రంలో 46,165 పోలింగ్ కేంద్రాలు’
రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎం.ఎన్.హరేంద్రప్రసాద్ టెలికాం సర్వీసు ప్రొవైడర్లను కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకూ త్వరతిగతిన నెట్వర్క్ సదుపాయం కల్పించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటిల్లో 50 శాతం చోట్ల పోలింగ్ ప్రక్రియను వెబ్కాస్టింగ్ చేస్తామని తెలిపారు. షాడో ఏరియాల్లోని 689 పోలింగ్ స్టేషన్లకు టవర్ల సదుపాయాన్ని కల్పించే పనులను వేగవంతం చేయాలని కోరారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు బల్క్ ఎస్.ఎం.ఎస్. ప్రచారానికి ఎంసీఎంసీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు.