India Reacts Strongly To US Remarks To CAA(International news in telugu): భారత్ లో ఇటీవల పౌరసత్వ సవరణ చట్టం .. సీఏఏ అమల్లోకి వచ్చింది. ఈ చట్టంపై అగ్రరాజ్య అమెరికా స్పందించింది. ఈ చట్టం అమలవుతున్న విధానాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తున్నామని యూఎస్ విదేశాంగ శాఖ పేర్కొంది. అదే సమయంలో సీఏఏపై ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మథ్యూ మిల్లర్ ఆందోళన వ్యక్తమంటూ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో మతాలన్నింటికీ స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నారు.
సీఏఏ విషయంలో అమెరికా ప్రకటనపై భారత్ అభ్యంతరం తెలిపింది. ఇది తమ దేశ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పింది. ఈ విషయంపై భారత్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రణ్ దీర్ జైశ్వాల్ కీలక ప్రకటన చేశారు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఝానిస్థాన్ దేశాల్లో హింసకు గురైన వారికి ఈ చట్టం ద్వారా భారత పౌరసత్వం కల్పిస్తున్నామని తెలిపారు. ఆయా దేశాల నుంచి భారత్ కు వలస వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, క్రైస్తవ, పార్శీ మతాలకు చెందిన వారికి పౌరసత్వంతోపాటు భద్రత కల్పించడానికి సీఏఏ తీసుకొచ్చామని స్పష్టం చేశారు. సీఏఏ ఏ ఒక్క పౌరుడి హక్కులకు భంగం కలిగించదన్నారు.
Also Read : అణు యుద్ధానికి సిద్ధమంటున్న రష్యా.. సార్వభౌమాధికారానికి, స్వాతంత్య్రానికి ముప్పు తప్పదా ?
సీఏఏ ఉద్దేశం పౌరసత్వం తీసేయడం కాదని రణ్ దీర్ జైస్వాల్ వివరణ ఇచ్చారు. అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. ఏ దేశంలోనూ పౌరసత్వం లేని వారికి రక్షణ కల్పిస్తుందన్నారు. మానవ హక్కులను కాపాడటానికే సీఏఏ ఉపయోగపడుతుందన్నారు.