PM Modi Tamil Nadu Tour : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల 10 రోజులపాటు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన మోదీ.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాష్ట్రాల టూర్ కు సిద్ధమవుతున్నారు. ఇటీవల రెండుసార్లు తమిళనాడులో పర్యటించిన ప్రధాని మరోసారి ఆ రాష్ట్రానికి వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. మార్చి 18న కోయంబత్తూర్ లో మోదీ రోడ్ షో నిర్వహించాలని బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది.
కోయంబత్తూర్ లో 3.6 కిలోమీటర్ల మోదీ రోడ్ షో నిర్వహించేలా బీజేపీ ప్లాన్ చేసింది. లక్ష మంది కాషాయ కార్యకర్తలు ఈ ర్యాలీ పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది. రోడ్ షో అనుమతి కోసం బీజేపీ జిల్లా అధ్యక్షుడు పోలీసులకు దరఖాస్తు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. దీంతో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం మోదీ రోడ్ షోకు షరతులతో అనుమతి ఇచ్చింది.
మోదీ రోడ్ షోకు అనుమతి ఇవ్వకపోవడానికి గల కారణాలను కోయంబత్తూర్ కమిషనర్ వెల్లడించారు. భద్రతా కారణాల వల్లే ఇవ్వలదేన్నారు. ఈ ప్రాంతంలో తమ ఘర్షణలు జరిగే అవకాశం ఉందన్నారు. కోయంబత్తూర్ ఆర్ఎస్ పురంలో 1998లో బాంబు పేలుళ్లు జరిగాయి. అప్పటి నుంచి కోయంబత్తూర్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Also Read : రేపే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్.. ఏపీ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు
1998 నుంచి కోయంబత్తూర్ లో రాజకీయ పార్టీల రోడ్ షోలకు పర్మిషన్ ఇవ్వడంలేదు. కోయంబత్తూర్ ఏరియాలో మార్చి 18, 19 తేదీల్లో పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అంటున్నారు. ఇలా అనేక కారణాలతో కోయంబత్తూర్ మోదీ రోడ్ షోకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కానీ హైకోర్టును ఆశ్రయించి బీజేపీ నేతలు పర్మిషన్ తెచ్చుకున్నారు.
తమిళనాడులో బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఈ రాష్ట్రంలో 39 లోక్ సభ స్థానాలున్నాయి. 2019 ఎన్నికల్లో డీఎంకే 24 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ కు 8 స్థానాలు దక్కాయి. సీపీఐ, సీపీఎం చెరో రెండు చోట్ల విజయం సాధించాయి. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న అన్నాడీఎంకే ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సారైనా బీజేపీ బోణి కొట్టాలని భావిస్తోంది. అందుకే తమిళనాడులో మోదీ వరస పర్యటనలు చేపడుతున్నారు.