ED Raids At MLC Kavitha House : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో సోదాలు చేపట్టిన ఈడీ .. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసింది. భారీ భద్రత మధ్య హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆమె నివాసం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు తరలించారు. ఆ తర్వాత శుక్రవారం రాత్రి 8.45 గంటలకు విమానంలో ఢిల్లీ తరలించారు. మరోవైపు ఈడీ విధులకు ఆటంకం కలిగించారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనా కేసు నమోదు చేశారు. రాత్రి ఈడీ కార్యాలయంలోనే కవితను ఉంచనున్నారు. శనివారం ఉదయం వైద్య పరీక్షలు చేయించిన తర్వాత మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు ఈడీ అధికారులు హాజరు పరచనున్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆమె ఇంటికి శుక్రవారం మధ్యాహ్నం ఈడీ అధికారులు వచ్చారు. ఆ తర్వాత నివాసంలోకి ఎవరీ అనుమతించలేదు. కవిత ఇంట్లో సోదాలు చేపట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గతంలో ఈడీ కవితను ఢిల్లీలో విచారించింది. తాజాగా మరోసారి విచారణ చేపట్టింది. ఈడీతోపాటు ఐటీ శాఖ కూడా ఈ సోదాలు చేపట్టింది. ఢిల్లీ నుంచి అధికారుల బృందం హైదరాబాద్ కు వచ్చింది. మొత్తం 4 బృందాలు తనిఖీలు చేపట్టాయి.
Also Read : ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు ఆమె భర్త వ్యాపార వ్యవహారాలపైనా ఈడీ అధికారులు ఆరా తీశారు. ఐటీ ఆఫీసర్ వివరాలు సేకరించారు. ఈడీ, ఐటీ తనిఖీలు చేస్తున్న సమయంలో బంజారాహిల్స్ లోని కవిత ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా కేంద్ర భద్రతా బలగాలను అక్కడ మోహరించారు. చివరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు.
బంజారాహిల్స్లోని కవిత ఇంట్లో ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని ఎనిమిది మంది అధికారులు తనిఖీలు చేశారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించారు. అరెస్ట్ కు కారణాలు చెప్పాలని ఈడీని కవిత ప్రశ్నించారని సమాచారం.
కవిత, ఆమె పీఏ ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను ఢిల్లీకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
కవిత అరెస్ట్ విషయం తెలియగానే బంజారాహిల్స్ లోని ఆమె నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ఆందోళనకు దిగాయి. ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్రానికి , ఈడీ వ్యతిరేకంగా గులాబీ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
కవిత అరెస్ట్ కు కారణం చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని ఆ పార్టీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ తెలిపారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టంచేశారు.
ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ఈడీ అధికారులను కేటీఆర్ నిలదీశారు. అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టులో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఉద్దేశపూర్వకంగానే శుక్రవారం వచ్చి కవితను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఈడీ ఆఫీసర్లు న్యాయస్థానంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.