PM Modi: నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. భారత ప్రధాని. ఒకేరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. రెండు చోట్లా రెండు వేరు వేరు స్పరూపాలు ప్రదర్శించారు. గెటప్ ఒక్కటే.. కానీ ఏపీలో ఒకలా, తెలంగాణలో మరొకలా కనిపించారు. ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా సాత్విక స్వరూపం. తెలంగాణలో కంప్లీట్ ఉగ్రరూపం.
విశాఖలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం పలికారు సీఎం జగన్. అనంతరం ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందకు సాగారు. ఏయూ గ్రౌండ్ లో అశేష ప్రజానీకంను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. ప్రధాని సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఆ ఏర్పాట్లన్నీ అధికార వైసీపీనే చూసుకుంది. బీజేపీ నామమాత్రానికే పరిమితమైంది. లక్షల్లో తరలివచ్చిన జనసందోహం చూసి మోదీ ఫుల్ ఖుషీ అయ్యారు. చాలా ఉత్సాహంగా కనిపించారు. ఏపీ గొప్పతనం గురించి పదే పదే ప్రస్తావిస్తూ.. దేశ అభివృద్ధిపై ప్రసంగించారు. కట్ చేస్తే…
మరో గంటలోనే తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు మోదీ. బేగంపేటలో తనకు స్వాగతం పలికిన బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. విశాఖలో ప్రధాని హోదాలో హుందాగా ప్రసంగిస్తే.. హైదరాబాద్ లో బీజేపీ అగ్రనేత హోదాలో విరుచుకుపడ్డారు. అధికార టీఆర్ఎస్ పై మహోగ్రరూపం ప్రదర్శించారు. మామూలుగా లేవు మోదీ కామెంట్లు. మాటల తూటాలే. ఎక్కడా కేసీఆర్, టీఆర్ఎస్ ప్రస్తావన లేకుండా విరుచుకుపడ్డారు.
అటు, రామగుండం సభలోనూ కేసీఆర్ కు నిద్ర లేకుండా చేశారు మోదీ. సింగరేణిని ప్రైవేటీకరణ చేసేది లేదంటూ.. ఆ హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉందంటూ.. హైదరాబాద్ నుంచి కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ.. పరోక్షంగా కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఘాటుగా మాట్లాడారు మోదీ.
గంటల వ్యవధిలోనే ఎంత తేడా. ఏపీలో సాఫ్ట్. తెలంగాణలో హార్ష్. అక్కడ ప్రభుత్వం, వైసీపీ ఫుల్ సపోర్ట్. ఇక్కడ సర్కారు, కేసీఆరు ఫుల్ అగెనెస్ట్. అందుకే, మోదీ తీరూ మారింది. మంచికి మంచి.. చెడుకు చెడు అన్నట్టు.. ఎక్కడి పరిస్థితికి తగ్గట్టు అక్కడ తన స్వభావాన్ని మార్చేశారు. దటీజ్ మోదీ అనిపించుకున్నారు. అందుకే ఆయన దేశ ప్రధాని కాగలిగారు అంటున్నారు.