Lok Sabha Election Schedule : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కు ముహూర్తం ఖరారైంది. లోక్ సభ, ఏపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది ఎన్నికల కమిషన్. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అనంతరం ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ను ప్రకటించనుంది. ఈ మేరకు ఈసీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న లోక్ సభకు ఈ ఏడాది జూన్ 16వ తేదీతో గడువు ముగియనుంది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకై ఎలక్షన్ కమిషన్ బృందం ఇటీవలే ఆయా రాష్ట్రాల్లో పర్యటించింది. స్థానిక రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలు నిర్వహించి.. ఎన్నికల షెడ్యూల్ ను సిద్ధం చేసింది. చివరిగా 2019 మార్చి 10న లోక్ సభ షెడ్యూల్ ను ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకూ 7 దశల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించి ఫలితాలను వెల్లడించారు. ఈ ఎన్నికలు కూడా ఏప్రిల్, మే నెలల్లోనే నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.
Also Read : ఎలక్టోరల్ బాండ్ల కేసులో SBIకు మరో బిగ్ షాక్.. మళ్లీ నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు..!
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లలో విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. మొత్తం 543 మంది ఎంపీ అభ్యర్థులకు గాను.. మొదటి జాబితాలో 195 మంది అభ్యర్థులను, రెండో జాబితాలో 72 మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ అధిష్ఠానం. వీటిలో తెలంగాణ నుంచి 17 పార్లమెంట్ స్థానాలుండగా 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా వరంగల్, ఖమ్మం స్థానాలను అభ్యర్థులను పెండింగ్ లో ఉంచింది. ఇక బీఆర్ఎస్ 9 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. మిగతా 8 మంది అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తుంది.
ఏపీ విషయానికొస్తే.. అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ఇప్పటి వరకూ 12 జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈనెల 16న ఇడుపులపాయలో సీఎం వైఎస్ జగన్ వైసీపీ తుదిజాబితాను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన- బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ తొలిజాబితాలో 94 మందిని, రెండో జాబితాలో 34 మంది అభ్యర్థులను ప్రకటించింది. జనసేన 5 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగమైన బీజేపీ ఇంతవరకూ అభ్యర్థులను ప్రకటించలేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక టీడీపీ, జనసేన, బీజేపీలు పూర్తిస్థాయి అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ఈ మూడు పార్టీలు జతకట్టాయన్న విషయం తెలిసిందే.