Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. SBI ఇటీవలే ఎలక్టోరల్ బాండ్స్ డేటాను ఎన్నికల కమిషన్(ఈసీ)కు అందించింది. అయితే SBI సమర్పించిన ఈ డేటాలో ఎలక్టోరల్ బాండ్ల నెంబర్లను తెలియజేయలేదు. దీంతో SBI వెల్లడించిన ఎలక్టోరల్ బాండ్స్ డేటాలో నెంబర్లు ఎందుకులేవో సమాధానం చెప్పాలని ఈరోజు ఉదయం ఎస్బీఐకి సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది.
ఎన్నికల కమిషన్ కు ఎస్బీఐ గురువారం అందించిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాల్లో బాండ్ల నెంబర్లను వెల్లడించలేదు. ఎలక్టోరల్ బాండ్ల నెంబర్లు లేకపోవడం వల్ల ఏ కంపెనీ ఏ రోజు ఏ రాజకీయ పార్టీకి ఎంత విరాళమిచ్చిందనే విషయం తెలిసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రతిపక్షాలు ఎస్బీఐ అందించిన డేటాపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎస్బీఐ అందించిన అరకొర డేటా వల్ల ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు ఎంత మొత్తంలో విరాళాలు అందాయో పూర్తి స్థాయి సమాచారం లేదని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. దీంతో ఎలక్టోరల్ బాండ్స్ నెంబర్లను ఎందుకు బహిర్గంతం చేయలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. దీనికి సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు నోటీసుల్లో పేర్కొంది.
Also Read: Pocso Case on Yediyurappa : బీజేపీకి షాక్.. మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు SBI ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీకి గురువారం అందించగా.. ఈసీ తన వెబ్సైట్లో ఆ డేటాను పెట్టింది. ఎస్బీఐ అందించిన డేటాను రెండు భాగాలుగా చేసిన ఈసీ.. 337 పేజీల సమాచారాన్ని తన వెబ్సైట్లో ఉంచింది. ఈ డేటా ద్వారా రూ. 11,671 కోట్ల విలువైన బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేసినట్లు తేలింది. అయితే ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి విరాళాలు ఇచ్చిందన్న వివరాలను ఈ డేటాలో వెల్లడించలేదు. దానికి మరో మూడు నెలల టైమ్ పడుతుందని SBI వెల్లడించింది.