Cyber Crime in Hyderabad: ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో సైబర్ నేరాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. అమాయకులనే కాకుండా ఉన్నత చదువులు చదివిన వారిని సైతం వీరు పలు రకాలుగా బురిడీ కొట్టించి లక్షల్లో కాజేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ సైబర్ ఘటనే హైదరాబాద్ మహానగరంలో వెలుగుచూసింది. ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని ఏకంగా రూ.31 లక్షలు పోగొట్టుకున్నాడు.
హైదరాబాద్ లో మరో సైబర్ మోసం వెలుగు చూసింది. సైబర్ కేటుగాళ్ల వలలో ఓ టెకీ చిక్కుకున్నాడు. పార్ట్ టైమ్ జాబ్ పేరిట తనకు వచ్చిన లింక్ క్లిక్ చేసి ఏకంగా రూ.31 లక్షలు పోగొట్టుకున్నాడు. తీరా మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఫిబ్రవరి 26న అమీన్పూర్ పురపాలక పట్టణ పరిధి నవ్యనగర్ కాలనీలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫోన్ కి పార్ట్ టైమ్ జామ్ అవకాశం అంటూ ఓ లింక్ వచ్చింది. దీని ద్వారా మరింత డబ్బులు సంపాదించవచ్చని భావించిన అతడు ఆ లింక్ క్లిక్ చేశాడు. ఆ లింక్ క్లిక్ చేయగా తొలుత అతడికి కొన్ని టాస్క్ లు ఇచ్చారు. దీంతో మరిన్ని టాస్క్ లు పూర్తి చేసి డబ్బులు పొందాలంటే.. దీనికి ఫీజుగా రూ.2,000 చెల్లించాలని సైబర్ నేరగాళ్లు నమ్మబలికారు.
దాన్ని నమ్మని అతను వారు చెప్పిన విధంగా చేశాడు. దీంతో అతడు కట్టిన డబ్బులకు మరికొంత డబ్బులు ఎరగా వేశారు. దీంతో వారు చెప్పిన విధంగా ఆ టెకీ పలు దశలుగా వారి అకౌంట్లో ఫీజు రూపంలో డబ్బులు జమ చేశాడు. అలా మొత్తంగా.. రూ.31 లక్షల కట్టాడు. తీరా వారి నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో కంగుతున్నాడు. చివరికి తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సైబర్ నేరం కింద కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు.
Also Read: Telangana Group 1 : గ్రూప్ -1 దరఖాస్తులకు గడువు పెంపు.. డీఎస్సీ పరీక్షల తేదీలు ఖరారు
కేసు నమోదు చేసుకున్న అమీన్పూర్ పోలీసులు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రజలు తమ ఫోన్ లకు వచ్చిన గుర్తు తెలియని లింక్ లను ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. కేటుగాళ్లు మొబైల్ ఫోన్ లకు రకరకాల లింక్ లు పంపించి డబ్బులు ఆశ చూపించి.. ఆపై లక్షల్లో కాజేస్తారని, డబ్బులకు ఆశపడి ఎవరూ ఆ లింక్ లు ఓపెన్ చేయవద్దని సూచించారు. పోలీసులు, ప్రభుత్వం సైబర్ నేరాలపై ఎంతగా ప్రచారం చేస్తున్నాసరే.. అమాయకపు ప్రజలతో పాటుగా ఉన్నత చదువులు చదివి మంచి మంచి జాబ్స్ చేస్తున్నవారు సైతం తరచుగా వీరి బారినపడి డబ్బులు పోగొట్టుకుంటున్నారని వెల్లడించారు.