Chevireddy VS Magunta in Ongole : ఆ పార్లమెంట్ సెగ్మెంట్కు ఇద్దరు బలమైన నేతలు బరిలోకి దిగడంతో పొలిటికల్ హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. రాష్ట్ర విభజన అనంతరం ఆ స్థానాన్ని రెండుసార్లు YCP కైవసం చేసుకుంది. ఈసారి మాత్రం తామే పాగా వేయాలని టీడీపీ యత్నిస్తోంది. వైసీపీ హ్యాట్రిక్ సాధించే విధంగా ప్రణాళిక రచిస్తోంది. ఇంతకూ ఆ ఎంపీ సెగ్మెంట్ ఎక్కడ? ఎందుకంత ప్రస్టేజస్గా మారింది.
ఒంగోలు పార్లమెంట్ స్థానంలో టీడీపీ, వైసీపీ నుంచి హేమాహేమీలు బరిలో దిగుతున్నారు. YCP అభ్యర్ధిగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు రాఘవరెడ్డి బరిలో తలపడుతున్నారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఒంగోలు పార్లమెంట్ స్థానంలో రాష్ట్ర విభజన తర్వాత.. వైసీపీ రెండుసార్లు జెండా ఎగురవేసింది. ఇప్పటికే రంగంలోకి దిగిన చెవిరెడ్డి అండ్ టీమ్.. పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించినట్లు సమాచారం. పార్లమెంట్ పరిధిలో పరిస్థితులను బేరీజు వేసుకుని.. వారు ప్రచారం చేసుకుంటున్నారు. చిన్న చిన్న కాంట్రాక్టుదారులకు, ప్రభుత్వం నుంచి బిల్లులు రాని నేతలకు.. చెవిరెడ్డి సొంతనిధులు పంపిణీ చేస్తూ అసమ్మతి క్యాడర్ను.. తన వైపు తిప్పుకుంటున్నారని వార్తలు గుప్పమంటున్నాయి. ఈసారి ఎన్నికల్లో బలమైన అభ్యర్థులైన చెవిరెడ్డి, మాగుంట రంగంలోకి దిగటంతో ఒంగోలు పాలిటిక్స్ హీట్ పెంచుతున్నాయి.
Also Read : గాజువాక ఇన్ఛార్జ్గా మంత్రి అమర్నాథ్.. విక్టరీ కోసం వైసీపీ ప్లాన్ ఏంటి ?
ఇటు.. మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంది. పార్లమెంట్ పరిధిలో మంచి పరిచయలూ ఉన్నాయి. ఎంపీ మాగుంట తనయడు రాఘవరెడ్డి టీడీపీ నుంచి ఈసారి ప్రత్యక్ష రాజకీయాలోకి దిగుతున్నారు. మాగుంట రాకతో పార్టీకి కొండంత బలం వచ్చిందని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. 2019 తర్వాత ఒంగోలు ఎంపీ అభ్యర్ధిగా ఎవరూ లేక.. టీడీపీ సందిగ్ధంలో పడింది. మాగుంట రాకతో పార్టీ విజయం ఖాయమనే భావనలో అధిష్టానం ఉందట. తొలిసారి బరిలో నిలుస్తున్న మాగుంట రాఘవరెడ్డి.. చెవిరెడ్డిని ఓడించడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. స్థానికేతరులైన చెవిరెడ్డిని చిత్తుగా ఓడించేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల్లో వైసీపీ ఆధిపత్యానికి ఎలాగైనా గండి కొట్టి తీరాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి భావిస్తున్నారు. మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో తన కుటుంబంపై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేసిన దాఖలాలు లేవనే విషయాన్ని చెప్పుకుంటున్నారు. తాను ఓటమిపాలైన సందర్భంలోనూ గెలిచిన అభ్యర్థిని కలిసి అభినందన తెలిపానని.. రాజకీయాల్లో శత్రువులుండరనేది మాగుంట వాదనగా ఉంది. అయితే.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడ్డుపరిస్థితులు ఎదుర్కొన్నానని మాగుంట చాలాసార్లూ తన అనుచరుల వద్ద అన్నట్లు సమాచారం.
మార్కాపురం వైసీపీ సమన్వయకర్త, గిద్దలూరు సిటింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. గతంలో మాగుంటపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రకాశం జిల్లాకు ఆయన ఏమి చేశారో చెప్పాలని సవాల్ కూడా విసిరారు. వ్యాపారాల కోసం పార్టీలు మారతారంటూ గుప్పించిన విమర్శలు ఈ ఎన్నికల్లో.. ఏ మేరకు ప్రభావం చూపుతాయనేది ఆసక్తిగా మారింది. మార్కాపురం అసెంబ్లీ బరిలో అన్నా రాంబాబు ఉన్నారు. ఆయన్ను ఓడించాలని మాగుంట తీవ్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఓటు బ్యాంక్కు చెక్ పెట్టాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారట. రెండు ప్రధాన పార్టీలూ ఈ సీటు కైవసం చేసుకునేందుకు అన్ని అవకాశాలనూ వదలటం లేదు.