WPL Eliminator MIW vs RCBW: క్రికెట్ లో అమ్మాయిలు అదరగొడుతున్నారు. అబ్బాయిలకు కూడా సాధ్యం కాని స్టన్నింగ్ క్యాచ్ లు పట్టుకుంటున్నారు. సిక్స్ కొడితే చాలు కారు అద్దాలు బద్దలవుతున్నాయి. అంత గొప్పగా ఆడుతున్న అమ్మాయిల మహిళల ప్రీమియర్ లీగ్ లో ఒక కీలకమైన మ్యాచ్ నేడు జరగనుంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు..? ఎవరు ఫైనల్ కి వెళతారు..? ఎవరు ఢిల్లీ క్యాపిటల్స్ను ఢీకొడతారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు నెట్టింట అదే చర్చ జోరుగా సాగుతోంది.
తన చివరి మ్యాచ్ లో ముంబైని ఓడించి ప్లే ఆఫ్స్ కి చేరిన ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్ లో కూడా ఇదే పట్టుదల, స్ఫూర్తితో ఆడి గెలవాలని చూస్తోంది. మ్యాచ్ రాత్రి 7.30 నుంచి స్పోర్ట్స్-18లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఎలీస్ పెర్రీ.. ఇప్పుడు ఉమెన్ క్రికెట్ లో మార్మోగుతున్న పేరు. ఆస్ట్రేలియా క్రికెటర్ కావడంతో కీలక సమయాల్లో ఎలా ఆడాలో వారికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శతో అదరగొట్టింది. ఛేదనలో ఆర్సీబీ వికెట్లు మూడు వెంటవెంటనే పడ్డాయి. దాంతో తను క్రీజులోకి వచ్చి ధనాధన్ ఆడి 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. మ్యాచ్ ని గెలిపించింది.
ఇప్పుడు అదే ప్రదర్శన మళ్లీ రిపీట్ చేయాలని ఆర్సీబీ ఆశపడుతోంది. కానీ హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై పటిష్టంగా ఉంది. ఏదో ఒక మ్యాచ్ లో ఓడిపోయినంత మాత్రానా అన్నింటా అలాగే జరగదని కొందరు అంటున్నారు. అంతేకాదు ఆ మ్యాచ్ లో ఓటమికి ఇక్కడ ప్రతీకారం తీర్చుకుని ఫైనల్ కి వెళదామని భావిస్తున్నారు.
Also Read: ఉమెన్స్ ఐపీఎల్ లీగ్ ఫైనల్ లో.. ఢిల్లీ క్యాపిటల్స్
ఆర్సీబీ వర్సెస్ ముంబై మధ్య జరిగిన నాలుగు మ్యాచ్ ల్లో మూడు ముంబై గెలిచింది. ఇక్కడ గెలిచిన జట్టు ఆదివారంనాడు ఘనంగా ప్రారంభమయ్యే WPL ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతుంది.
ఐదు జట్లు పోటీపడ్డ డబ్ల్యూపీఎల్ 2024 లో లీగ్ దశలో 12 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్ గా ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ కి చేరుకుంది. ఒకవేళ ముంబై గెలిస్తే సీజన్ 2023 పునరావృతం అవుతుందని అంటున్నారు. ఎందుకంటే గత సీజన్ లో కూడా వీళ్లిద్దరే పోటీ పడ్డారు. ముంబై ఇండియన్స్ విజయ పతాకం ఎగురవేసింది.