Gajuwaka YSRCP Incharge Gudivada Amarnath(Andhra politics news): ఏపీ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఓ రకంగా ఆ సీటు చాలా కీలకమైందని చెప్పాలి. ఇక్కడ గెలిస్తే.. ఉత్తరాంధ్ర మొత్తం గెలిచినట్లేనని లెక్కుంది. అందుకే అన్ని రాజకీయ పార్టీలు గాజువాక సీటుపై ప్రత్యేక శ్రద్ద పెట్టాయి. నియోజకవర్గంలో కీలకమైన స్టీల్ ప్లాంట్ ఉండటమే అన్ని రాజకీయ పార్టీలు ఆలోచనలో పడటానికి కారణంగా మారాయి. ఇప్పటి వరకూ టీడీపీ,జనసేన, వైసీపీ, బీజేపీ.. ఏ పార్టీ కూడా గాజువాక అభ్యర్థిని ప్రకటించలేదంటేనే.. ఆ సీటు ప్రభావం ఎంతలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. సిట్టింగ్ సీటు ఈసారి ఎలాగైనా గెలవాలని వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. టీడీపీ-జనసేన కూటమి కూడా గాజువాకలో పాగా వేసేందుకు అన్ని అవకాశాలనూ పరిశీలిస్తోంది.
గాజువాక విషయంలో ఆచితూచి వ్యవహారిస్తున్న YCP.. ఆరు నెలల కిందటే ఓ ప్లాన్ వేసింది. 4 నెలల కిందట సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డిని ఇన్ఛార్జ్ భాద్యతల నుంచి తప్పించింది. నాగిరెడ్డి నుంచి కార్పొరేటర్గా బీఫామ్ అందుకున్న ఉరికూటి రామచంద్రరావును నియోజకవర్గం ఇన్ఛార్జ్గా చేసింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డితో సహా ఆయన ఫ్యామిలీ వైసీపీకి ఎదురుతిరిగారు. పార్టీ పదవులకు కూడా రాజీనామా చేసేసింది. ఆ తర్వాత అధిష్టానం బుజ్జగించటంతో నెమ్మదించిన నాగిరెడ్డి.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే సొంత క్యాడర్ను యాక్టివ్ చేసుకుంటున్నారు. మళ్లీ తనకు అవకాశం వస్తుందనే నమ్మకంతో ఆయన ముందుకు సాగుతున్నట్లు సమాచారం. మరోవైపు రామచంద్రరావు కూడా నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ బిజీ అయ్యారు. తాజాగా.. ఎన్నికల నోటిఫికేషన్ ముందు సర్వే పేరుతో రామచంద్రరావుని పక్కన పెట్టి.. ఆ స్థానంలో మంత్రి అమర్నాథ్కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దీంతో గాజువాకలో వైసీపీ అసలు రాజకీయం మొదలుపెట్టిందనే చర్చ జరుగుతోంది.
Also Read : రోడ్డెక్కిన రాజోలు రాజకీయం.. ఊహించని ట్విస్ట్తో ఆందోళనలో వైసీపీ శ్రేణులు
గత ఎన్నికల్లో టీడీపీ- జనసేన వేర్వేరుగా పోటీ చేశాయి. గాజువాక జనసేన ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు బరిలో దిగారు. వైసీపీ నుంచి పోటీ చేసిన నాగిరెడ్డి.. పవన్ కళ్యాణ్ను ఓడించారు. ఇదంతా పాత కథే అయినా.. పవన్ లాంటి బలమైన వ్యక్తిని ఓడించడంతో మరోసారి నాగిరెడ్డికే టికెట్ అంటూ ప్రచారం సాగింది. ఆయనతో పాటు పవన్ కూడా మరోసారి గాజువాక బరిలో నిలుస్తారని అంతా అనుకున్నారు. కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ పక్కకు వెళ్లడంతో టీడీపీ అభ్యర్థి పల్లా పోటీలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పల్లాను ఎదుర్కోవాలంటే రామచంద్రరావు సరిపోరని భావించి.. ఆ సీటును అమర్నాథ్కు ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఎన్నికల అంచనాలు మారనున్నాయి. అక్కడున్న ఈక్వెషన్స్ ఆధారంగా అమర్నాథ్ను పోటీలో నిలపాలని పార్టీ భావిస్తోందట. అయితే అది అంత ఈజీ కాదని రాజకీయవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
మంత్రి అమర్నాథ్.. 2019 ఎన్నికల ముందు నుంచి జనసేనానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక.. తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కూడా అదే వైఖరి అనుసరించారు. ఎన్నికల సర్వేల పేరుతో అమర్నాథ్కు అనకాపల్లి సీటును ఇవ్వని వైసీపీ.. NRI భరత్ కుమార్ను తెరపైకి తెచ్చింది. భరత్ను పరిచయం చేసిన వేదికపైనే మంత్రి అమర్నాథ్ కంటతడి పెట్టుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు అమర్నాథ్కు సీటు లేదనే నోర్లు మూయించడానికి వైసీపీ అధిష్టానం గాజువాక సీటు కేటాయించిందనే వార్తలు గుప్పుమంటున్నాయి.
Also Read : పిఠాపురం సెంటిమెంట్.. పవన్ కల్యాణ్ గెలుపు నల్లేరుపై నడకేనా..!
గాజువాక ఇన్ఛార్జ్గా నాగిరెడ్డికి బదులుగా ఉరికూటి రామచంద్రరావుని ప్రకటించినప్పుడే ఇదంతా అమర్నాథ్ సహకారంతో జరుగుతోందని అందరూ భావించారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాగిరెడ్డిని తప్పించడానికి, వైసీపీ గేమ్ ప్లాన్లో భాగంగానే ఇదంతా జరిగిందనే రూమర్స్ కూడా వచ్చాయి. చందూని సర్వేల పేరుతో పక్కన పెట్టి అమర్నాథ్కు సీట్ ఇవ్వడం కూడా సింపుల్గా జరగలేదని వైసీపీ నేతలే అంతర్గతంగా చర్చించుకుంటున్నారట. ఇన్ఛార్జ్గా ప్రకటన అయితే చేశారు కానీ.. అటు పార్టీతో పాటు అమర్నాథ్ ఎదుట అనేక సవాళ్లు ఉన్నాయని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రానున్న ఎన్నికల్లో కీలకంగా మారనుంది. స్టీల్ ప్లాంట్ అమ్మకం చేయడానికి కేంద్రం ప్రయత్నాలు మొదలు పెట్టిన నాటి నుండి నేటి వరకు సీఎం జగన్ సరిగ్గా స్పందించలేవనే విమర్శలు ఉన్నాయి. ప్రచారంలో స్టీల్ ప్లాంట్ విషయంలో.. వైసీపీ అధిష్టానం, సీఎం జగన్ ఎలాంటి హామీ ఇచ్చి ప్రజలను శాంతింప చేసి ఓట్లు రాబడతారో అనే ఉత్కంఠ సాగుతోంది.
సామాజిక పరంగా మంత్రి అమర్నాథ్.. కాపు కులానికి చెందిన వ్యక్తి అయినా.. గత ఎన్నికల్లో అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గాజువాకలో ఓడిపోయారు. కులం, సినిమా ఇమేజ్.. రెండూ ఎక్కడా పని చేయలేదు. మరి పవన్ను తిట్టిపోసినంత మాత్రాన అమర్నాథ్కు ఓట్లు వస్తాయా? అనే వాదనలూ ఉన్నాయట. గాజువాకలో యాదవ సామాజికవర్గం ఓట్లు కీలకమైనవి. పల్లా శ్రీనివాసరావుది అదే సామాజికవర్గం కావడంతో టీడీపీ-జనసేన కూటమికి కలిసి వచ్చే అంశంగా మారింది. కూటమిలో భాగంగా జనసేన ఓట్లు కూడా టీడీపీకి పడే అవకాశాలున్నాయి. కాబట్టి అమర్నాథ్కు అంత ఈజీ కాదని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. టీడీపీ-జనసేన కూటమికి బీజేపీ రూపంలో స్టీల్ ప్లాంట్ అమ్మకం తలనొప్పిగా మారే అవకాశాలూ ఉన్నాయి. చంద్రబాబు, పవన్తో బీజేపీ చేతులు కలపడంతో.. అమర్నాథ్ని బరిలో దింపి.. కాపు సామాజిక వర్గంతో పాటు వైసీపీ కేడర్ ఓట్లు రాబడితే చాలనే కోణంలో వైసీపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. వైసీపీ అధిష్టానం ఆలోచన, మంత్రి అమర్నాథ్ ప్లాన్ ఎంతవరకూ కలసి వస్తుందో.. ఆ సీటులో ఎవరు పాగా వేస్తారో చూడాలి మరి.