Electoral Bonds Data(Today news paper telugu): ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఎన్నికల సంఘం గురువారం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ సమర్పించిన వివరాలను ఈసీ తన వెబ్సైట్లో పెట్టింది.
ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఈసీ రెండు భాగాలుగా పేర్కొంది. మొత్తం 337 పేజీల డేటాను వెబ్సైట్లో ఉంచింది. రూ.11,671 కోట్ల విలువైన బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేసినట్లు ఈ డేటా ద్వారా తెలుస్తోంది. ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి విరాళాలు ఇచ్చిందన్న వివరాలను ఇందులో పొందుపరచలేదు. ఆ వివరాలన్నీ ఇచ్చేందుకు మరో 3 నెలల సమయం పడుతుందని ఎస్బీఐ వెల్లడించింది.
అయితే.. ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయన్న వివరాలను ఫ్యాక్ట్ ఫైండర్ మహమ్మద్ జుబేర్ వెల్లడించారు. బీజేపీకి రూ.6,061 కోట్లు, తృణమూల్కు రూ.1,610 కోట్లు, కాంగ్రెస్కు రూ.1,422 కోట్లు వచ్చాయి. బాండ్లను కొనుగోలు చేసిన కంపెనీల్లో స్టీల్ పారిశ్రామిక దిగ్గజం లక్ష్మీ మిత్తల్ నుంచి బిలియనీర్ సునీల్ భారతీ మిత్తల్, అనిల్ అగర్వాల్, ఐటీసీ, మహీంద్ర అండ్ మహీంద్ర, కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజినీరింగ్, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్, ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కంపెనీలున్నాయి. మరోవైపు ఎలక్టోరల్ బాండ్లపై ఇవాళ ఎన్నికల సంఘం దరఖాస్తుపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
Also Read : కొత్త ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియ పూర్తి.. సుఖ్బీర్ సంధూ, జ్ఞానేశ్ కుమార్ కు అవకాశం..
2022 మార్చి నుంచి ఈడీ దర్యాప్తు జరుపుతున్న ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అత్యధికంగా రూ.1,368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. ముంబైకి చెందిన క్విక్ సప్లై చైన్ సంస్థ రూ.410 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత రూ.400 కోట్ల బాండ్లను కొనుగోలు చేసింది. హల్దియా ఎనర్జీ సంస్థ రూ.377 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఘజియాబాద్ కేంద్రంగా పనిచేసే యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రూ.162 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. స్టీల్ టైకూన్ లక్ష్మీ మిత్తల్ తన సొంత డబ్బు 35 కోట్లతో బాండ్లను కొన్నారు. దానితోపాటు ఆయనకు చెందిన కంపెనీలు మరో రూ.247 కోట్ల విలువైన బాండ్లను కొన్నాయి.
ఇక.. ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ విరాళం రూ.224 కోట్లు.. వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ 220 కోట్లు.. కెవెంటర్ ఫుడ్ పార్క్ ఇన్ఫ్రా లిమిటెడ్ రూ.194 కోట్ల బాండ్లను కొనుగోలు చేశాయి. మదన్లాల్ లిమిటెడ్ రూ.185 కోట్లు.. డీఎల్ఎఫ్ గ్రూప్ రూ.170 కోట్లు.. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ రూ.123 కోట్ల బాండ్లను కొనుగోలు చేశాయి. బిర్లా కార్బన్ ఇండియా రూ.105 కోట్లు.. రుంగ్తా సన్స్ రూ.100 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశాయి.
మరోవైపు.. కిరణ్ మజుందార్ షా, వరుణ్ గుప్తా, బీకే గోయెంకా, జైనేంద్ర షా, మోనికా వ్యక్తిగతంగా బాండ్లను కొన్నారు. బజాజ్ ఫైనాన్స్ రూ.20 కోట్లు, బజాజ్ ఆటో రూ.18 కోట్లు, ఇండిగో సంస్థలు రూ.36 కోట్లు, స్పైస్ జెట్ రూ.65 లక్షల బాండ్లను కొనుగోలు చేశాయి. ఇండిగో సంస్థకు చెందిన రాహల్ భాటియా రూ.20 కోట్ల బాండ్లను కొన్నారు. రూ.10 లక్షల విలువైన బాండ్లను 4,620 మంది, లక్ష విలువైన బాండ్లను 2,228 మంది కొనుగోలు చేశారు.
Also Read : జమిలీ ఎన్నికలపై అధ్యయనం పూర్తి.. రాష్ట్రపతికి కోవింద్ కమిటీ నివేదిక
ఇక.. తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ రాజకీయ పార్టీలకు 966 కోట్ల విరాళం ఇచ్చింది. 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటివరకూ ఆ సంస్థ కోటి రూపాయల విలువైన రూ.966 బాండ్లను కొనుగోలు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసిన జాబితా ద్వారా వెల్లడైంది. షిర్డీసాయి ఎలక్ట్ట్రికల్స్ లిమిటెడ్ ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఒక్క రోజే కోటి విలువైన 40 బాండ్లను కొనుగోలు చేసి రూ.40 కోట్ల విరాళం ఇచ్చింది. ఐల్యాబ్స్ హైదరాబాద్ టెక్నాలజీ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.5 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది.
ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఏపీలో అందిన విరాళాల్లో వైసీపీదే అగ్రస్థానం. ఆ పార్టీకి ఇప్పటిదాకా రూ.337 కోట్లు అందాయి. టీడీపీకి రూ.219 కోట్లు వచ్చాయి. జనసేనకు రూ.21 కోట్ల విరాళాలు వచ్చాయి.
తెలంగాణలో బీఆర్ఎస్కు రూ.1,215 కోట్ల విరాళాలు వచ్చాయి. బీజేడీకి రూ.776 కోట్లు, డీఎంకేకు రూ.639 కోట్లు, శివసేనకు రూ.158 కోట్లు, ఆర్జేడీకి రూ.73 కోట్లు, ఆప్కు రూ.65 కోట్లు, జనతాదళ్కు రూ.44 కోట్లు, ఎన్సీపీకి రూ.31 కోట్లు, ఎస్పీకి రూ.14 కోట్లు, జేడీయూకు రూ.14 కోట్ల విరాళాలు వచ్చాయని మహమ్మద్ జుబేర్ తెలిపారు.