Manasa Devi : శివుని కుమారులైన గణపతి, సుబ్రహ్మణ్యుడి గురించి మీరు వినే ఉంటారు. కానీ, మహాదేవుడి కుమార్తె ఎవరో తెలుసా? ఆమె పేరే.. మానసాదేవి. ఈమె హరిద్వార్ క్షేత్రంలో బిల్వ పర్వతంపై కొలువై భక్తులకు దర్శనమిస్తుంది. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరున్న మానసాదేవిని పూజిస్తే తెలిసీ తెలియక సర్పాలను గాయపరచినా, చంపినా కలిగే కాలసర్పదోషం కూడా తొలగిపోతుందని ప్రతీతి. సాధారణంగా శుక్రవారం దేవతలను ప్రత్యేక పూజిస్తుంటారు. అందుకే మానసా దేవికి ఈ రోజు పూజలు చేస్తే శుభ ఫలితాలు ఉంటాయని భక్తుల నమ్మకం.
పూర్వం భూలోకంలో పాముల బెడద పెరిగిపోయింది. దీంతో ప్రజలంతా సర్పభయంతో గడగడలాడిపోగా, వారిని కాపాడేందుకు కశ్యప మహాముని తన మనో సంకల్పం చేత ఒక దేవతని సృష్టించాడు. ఆమెయే మానసా దేవి. క్షీరసాగరమథనం జరిగినప్పుడు కాలకూట విషాన్ని మింగిన శివుడు సృహ తప్పి పడిపోగా, ఆ విషం ఆయన మీద పనిచేయకుండా శివుని మానస పుత్రిక అయిన మానసాదేవి అడ్డుకొందనే కథ కూడా ఉంది.
మరో గాథ ప్రకారం, వాసుకి, మానసాదేవి అన్నాచెల్లెళ్లు. జరత్కారువు అనే మునితో మానసాదేవి వివాహం జరుగుతుంది. వీరికి అస్తీకుడు అనే కుమారుడు పుడతాడు. ఇదే సమయంలో జనమేజయ మహారాజు సర్పయాగాన్ని ప్రారంభిస్తాడు. ఆయన యాగం చేస్తూ, ఒక్కో మంత్రం చదువుతుంటే భూమ్మీద ఉన్న పాములన్నీ ఆ మంత్రబలం ధాటికి ఎగిరి వచ్చి యాగాగ్నిలో పడి ఆహుతై పోతుంటాయి. ఈ సంగతి తెలిసిన వాసుకి భయంతో గడగడలాడిపోతుంటాడు. దీనిని గమనించిన మానసాదేవి, ఆ యాగాన్ని ఆపేయమని తన కుమారుడైన అస్తీకుడి ద్వారా జనమేజయ మహారాజుకు కబురు పెడుతుంది.
Also Read : విమర్శించకు.. విశ్లేషించుకో
అలా వెళ్లిన అస్తీకుడిని ఆ మహారాజు సాదరంగా ఆహ్వానించి, ఏం కావాలని అడగ్గా, తక్షణం యాగాన్ని ఆపేయాలని అస్తీకుడు విజ్ఞప్తి చేయగా, అందుకు మహారాజు అంగీకరించగా, సర్ప సంహారం ఆగిపోతుంది. దీంతో నాగులన్నీ తమ జాతిని కాపాడేందుకు తన కుమారుడిని పంపి పుణ్యం కట్టుకున్న మానసాదేవి వద్దకు వచ్చి నమస్కరించి, నేటి నుంచి నిన్ను ఎవరు పూజించినా వారికి సకల సర్పదోషాలు తొలగిపోతాయని నాగులన్నీ అమ్మవారికి మాట ఇచ్చాయని పురాణ కథనం. సంతానలేమికి కారణమయ్యే కాలసర్పదోషం కూడా మానసాదేవి పూజతో తొలగి, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.
మానసాదేవి ఆలయం హరిద్వార్ క్షేత్రంలోని బిల్వ పర్వతం మీద అమ్మవారి ఆలయం ఉంటుంది. దీనిని సిద్ధపీఠం అంటారు. మానసదేవిని సందర్శించుకున్న అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలోని చెట్టుకు దారాన్ని కట్టి తమ మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటారు. కోరిక తీరిన తర్వాత తిరిగి ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. బెంగాల్లో అన్ని వర్ణాల వారూ ఈ అమ్మవారిని పూజిస్తారు. ఒంటి నిండా సర్పాలతో, తల మీద పడగతో, ఒడిలో పిల్లవాడితో ఉన్న మానసాదేవి దేవాలయాలు ఉత్తర భారతంలో అనేక చోట్ల కనిపిస్తాయి. మానసాదేవిని కొన్ని ప్రాంతాల్లో చెట్టు కొమ్మ, మట్టి కుండ, రాయి, పుట్ట ఇలా పలు రూపాల్లో ఆరాధిస్తారు. అసలు ఏ రూపం లేకుండానూ కొందరు మానసాదేవిని ఆరాధిస్తారు.
ఆలయానికి వచ్చే భక్తులు ఇక్కడికి సమీపంలోని మాయాదేవి ఆలయం, చండీదేవి ఆలయాలనూ భక్తులు దర్శించుకుంటారు. ఈ మూడు ఆలయాలనూ శక్తి పీఠాలుగా చెబుతారు. గంగా నదీ తీరాన గల మెట్ల మార్గం లేదా రోప్ వే ద్వారా ఈ ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. హరిద్వార్ రైల్వేస్టేషన్ నుంచి 2.5 కి.మీ.దూరంలో ఈ ఆలయం ఉంది.