Idagunji Maha Ganapathi Temple History & Special: విఘ్నాలను దూరం చేసే దైవం వినాయకుడు. అయితే.. కర్ణాటకలోకి హొన్నావర తాలూకాలోని ఇడగుంజి గ్రామంలని వినాయకుడి ప్రత్యేకతే వేరు. పెళ్లికాని వారు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శిస్తే చాలు, వారు త్వరలోనే ఓ ఇంటివారవుతారని ప్రతీతి. ఇందుకు రుజువుగా రోజూ వందల మంది యువతీ యువకులు ఇక్కడ కొలువై ఉన్న స్వామిని దర్శించుకుని తమ మనసులోని మాటను చెప్పుకుంటూ కనిపిస్తారు. శరావతీ నది అరేబియా సముద్రంలో కలిసే సంగమ క్షేత్రంలో ఈ ఆలయం ఉంది.
స్థలపురాణం ప్రకారం, ఇంకొన్నాళ్లలో ద్వాపరయుగం ముగిసి, కలియుగం రాబోతుందనగా, ఈ ప్రాంతంలోని కుంజవనంలో వాలఖిల్యుడు అనే ముని కృష్ణ పరమాత్మ సహాయం కోసం గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు. కలియుగంలో మానవులు ఎదుర్కోబోయే విపత్తులను ఉపశమింపజేసేందుకు ఇక్కడి శరావతీ నదీ తీరాన శిష్యులతో ఆయన తలపెట్టిన ఆ యాగానికి తరచూ విఘ్నాలు ఏర్పడుతుండేవి. దీనికి కారణమేంటో తెలియని వాలఖిల్యుడు, ఇతర మునులంతా నారదుని సలహా కోరగా, గణేశుడు ఇక్కడ ఉంటే ఆ విఘ్నాలు దరిచేరవని సూచిస్తాడు. దీంతో మునులంతా కైలాసానికి వెళ్లి గణపయ్యను ప్రార్థించి, ఆయనను వెంటబెట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చి యాగశాలలో కూర్చోబెడతారు. ఈ ప్రాంత రమణీయతకు ముచ్చటపడిన గణపయ్య కలియుగాంతం వరకు ఇక్కడే ఉండాలని భావించి, ఇడగుంజిలో నిలబడిపోయాడు.
Also Read: శుక్రవారం శివుని పుత్రికకు పూజ.. మానసాదేవి చరిత్ర తెలుసా..!
ఇక్కడి వినాయకుడు బ్రహ్మచారి రూపంలో దర్శనమిస్తాడు. ఒక చేతిలో కలువ పువ్వు, మరోచేతిలో మోదకంతో, మెడలో సాధారణమైన పూలదండతో నిరాడంబరంగా కనిపిస్తాడు. సాధారణంగా ఏకదంతుడిగా దర్శనమిచ్చే ఇక్కడి గణపయ్య, ఇక్కడ మాత్రం రెండు దంతాలతో కనిపిస్తాడు. గణేశ ఆలయాల్లో స్వామి వాహనంగా దర్శనమిచ్చే ఎలుక ఇక్కడ కనిపించదు. ఇక్కడ స్వామి వాహనమూ లేకుండా, పీఠంపై దర్శనమిస్తాడు.
ఇక, రోజూ దేశం నలుముూలల నుంచి పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిలు ఇక్కడికి వచ్చి స్వామికి గరికెను సమర్పించి త్వరగా మంచి జీవిత భాగస్వామిని ప్రసాదించమని కోరుకుంటుంటారు. కర్ణాటకలోని బంధి తెగ వారు తమ కుటుంబంలో ఎవరికైనా పెళ్లి చూపులు కాగానే, అబ్బాయి, అమ్మాయి తరపు వారంతా ఈ గుడికి వచ్చి, స్వామి పాదాల చెంత రెండు చీటీలు ఉంచుతారు. వాటిలో కుడికాలి వద్ద ఉంచిన చీటీ కిందపడితే ఆ పెళ్లికి స్వామి అనుమతి లభించినట్లు భావించి, పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటారు. ఒకవేళ.. ఎడమ కాలివద్ద చీటీ కిందపడితే ఆ సంబంధాన్ని మర్చిపోయి, మరో పెళ్లి సంబంధం కోసం ప్రయత్నాలు మొదలుపెడతారు. ప్రముఖ శైవ క్షేత్రమైన గోకర్ణానికి సమీపంలోనే ఈ ఇడగుంజి ఉంది. ఏటా 10 లక్షలకు పైగా భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు.
Tags
Share