Ambati Rambabu Latest News(Political news in AP): వైసీపీలో ఇన్ఛార్జ్ల నిర్ణయాలు టీవీ సీరియల్ని తలపిస్తున్నాయి. సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్న అంబటి రాంబాబును తాజాగా పొన్నూరు ఇన్ఛార్జ్గా నియమించటం వైసీపీ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఆది నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరుడిగా ఉన్న అంబటి రాంబాబు 1989లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరపున రేపల్లె ఎమ్మెల్యేగా నెగ్గారు. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ను వీడి వచ్చిన నేతల్లో ఆయనా ఒకరు. పార్టీలో చేరి తన వంతు సేవలందిస్తూ వచ్చిన అంబటికి 2014లో సత్తెనపల్లి వైసీపీ టికెట్ కూడా ఇచ్చారు. కానీ, ఆ ఎన్నికల్లో ఆయన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మీద స్వల్ప తేడాతో ఓడిపోయారు.
2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఈ సీటుకు వేర్వేరు పేర్లు పరిశీలించినా, అంబటి గట్టిగా పట్టుబట్టటంతో చివరికి సీటు ఆయనకే దక్కింది. ఎట్టకేలకు 30 ఏళ్ల తర్వాత మళ్లీ వైసీపీ తరపున ఎమ్మెల్యే కాగలిగారు. ఆ తర్వాత రెండున్నరేళ్లకు జరిగిన మంత్రి వర్గ ప్రక్షాళనలో ఆయనను నీటి పారుదల శాఖా మంత్రిగానూ నియమించారు. అసెంబ్లీలో, బయటా ఆయన విపక్షాల మీద తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ జగన్ మీద ఈగవాలనివ్వకుండా చూస్తూ వచ్చారు. అటు సొంత సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్, జనసేన పార్టీ మీద నిప్పులు కురిపిస్తూ వైసీపీకి గట్టి మద్దతుదారుగా పేరు తెచ్చుకున్నారు.
ఇక.. 2024 జనవరి నాటికి అంబటి పరపతి పార్టీలో తగ్గుతూ వచ్చింది. ఒకవైపు జనసేన విజృంభణ, టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తు కుదరటంతో వైసీపీ అధిష్ఠానం ఆయనను పక్కనబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసేసింది. అందులో భాగంగా ఆయనను సత్తెనపల్లి నుంచి పొన్నూరు ఇన్ఛార్జ్గా నియమించింది.
Also Read: హతవిధీ.. ముద్రగడకు ఎంటీ దుస్థితి ..!
అక్కడ ఇప్పటికే కాపు సామాజిక వర్గానికే చెందిన కిలారు రోశయ్య (మాజీ కేంద్రమంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు) ఎమ్మెల్యేగా ఉండగా అంబటి నియామకం వైసీపీ నేతలనే ఆశ్చర్యంలో ముంచింది. తనకు ఎలాంటి పట్టులేని ఆ స్థానంలో తాను బరిలో దిగితే ఓటమి ఖాయమని, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వంటి సీనియర్ నేతను ఢీకొట్టటం సాధ్యం కాదని అంబటి ఎంత మొత్తుకున్నా పార్టీ ఆయన వాదనను పరిగణనలోకి తీసుకోలేదు. తప్పని పరిస్థితిలో పార్టీ మాటను గౌరవించిన అంబటి పొన్నూరు వెళ్లేందుకు సిద్ధపడే సమయంలోనే గుంటూరు ఎంపీగా బరిలో దిగాలని తాజాగా పార్టీ ఆయనను కోరినట్లు సమాచారం.
మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకట రమణను గుంటూరు ఎంపీగా బరిలో దిగాలని వైసీపీ కోరగా, అక్కడ గెలుపు సాధ్యం కాదనే అనుమానంతో ఆయన దానికి నో చెప్పగా, తాజాగా పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, కాపు సామాజిక వర్గానికి చెందిన కిలారు వెంకట రోశయ్యకు ఆ ఎంపీ సీటు ఆఫర్ చేసిందనీ, ఆయన కూడా దానికి ఒప్పుకోకపోవటంతో తాజాగా అక్కడ అంబటి రాంబాబును బరిలో దించనున్నట్లు తెలుస్తోంది.
అయితే, అక్కడ టీడీపీ తరపున ఎంపీగా బరిలో దిగనున్న విజ్ఞాన్ సంస్థల అధినేత కుమారుడు, లావు కృష్ణదేవరాయల మీద తమ అభిమాన నేతను బరిలో నిలిస్తే ఘోరపరాయజం తప్పదని అంబటి అభిమానులు అనుమానిస్తున్నారు. అయితే.. మాజీ ఎంపీ, నరసారావుపేటకు చెందిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సత్తెనపల్లి సీటు కోరారని, ఆయన కోసమే అంబటిని సత్తెనపల్లి నుంచి పంపేశారని తెలియటంతో వైసీపీ కోసం సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలను టార్గెట్ చేయటానికి వెనకాడని తమ అభిమాన నేత అంబటికి చివరికి పార్టీ ఇచ్చిన గౌరవం ఇదేనా అని ఆయన అభిమానులు మండిపడుతున్నారు.