Mudragada Padmanabham Postponed the Decision to Join in YSRCP Party: ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. కొన్నాళ్లుగా మారుతున్న రాజకీయం దెబ్బకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఉక్కపోతకు గురవుతున్నారు. చాలారోజులుగా టీడీపీని, జనసేనానిని టార్గెట్ చేస్తూ వచ్చిన పద్మనాభం, వైసీపీ అధినేత మనసు గెలిచి, ఆ పార్టీలో చేరాలని వ్యూహాలు రచించారు. తనకు, తన కుమారుడికి ఏ ఏ సీట్లు కావాలో కూడా ఈయనే డిసైడ్ చేసేసుకున్నారు. కానీ, ముద్రగడ మనసును గ్రహించిన జగన్, ఖచ్చితంగా ఈయన ఆశిస్తున్న సీట్లలో వేరు ఇన్ఛార్జ్లను ప్రకటించేశారు. దీంతో ఒక్కసారి ఆందోళనకు గురైన ముద్రగడ ప్లాన్ బీకి రంగం సిద్ధం చేశారు.
జనసేన పార్టీలో పనిచేసే కాపు నేతలను తన ఇంటికి ఆహ్వానించి మంచి ఆతిథ్యం ఇచ్చేసారు. పనిలో పనిగా ‘మనమంతా ఒక్కటి కావాలి’ అని జనసేనానితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మనసులో మాటను చెప్పేశారు. అంతటితో ఆగకుండా లేఖల రాజకీయం మొదలుపెట్టారు. ఒకదశలో పవన్ కల్యాణ్ కూడా ముద్రగడ ఇంటికి వెళ్లి చర్చించనున్నారనే వార్తలూ వచ్చాయి. దీంతో ముద్రగడ జనసేనలో చేరడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ముద్రగడ డిమాండ్లను పవన్ పరిగణనలోకి తీసుకోలేదు. ముద్రగడ ఇంటికీ వెళ్లలేదు. దీంతో ముద్రగడ హర్ట్ అయిపోయారు. ఈ పరిణామాలను గమనించిన జగన్, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డిని రాయబారానికి పంపి పార్టీలో చేరాలని కోరారు. తనకు అన్ని పార్టీల తలుపులూ మూసుకుపోవటంతో ఇక విధిలేని పరిస్థితుల్లో ఆయన వైసీపీలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది.
మార్చి 14న తాను, తన కుమారుడు, అనుచరులంతా కిర్లంపూడి నుంచి భారీ ర్యాలీతో తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో బేషరతుగా పార్టీ కండువా కప్పుకోనున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. పార్టీ ఏ పదవి ఇచ్చినా తన వంతు న్యాయం చేస్తానని అన్నారు. తనతో కలిసి ప్రయాణం చేయాలనుకునే అభిమానులంతా మార్చి 14న తాడేపల్లికి తరలి రావాలని, ఎవరి భోజనాలు, వాహనాలు వారే సమకూర్చుకోవాలని అభిమానులకు ఓ లేఖ కూడా రాసేశారు. అంతా రెడీ అనుకుంటున్న సమయంలో ర్యాలీ రద్దు చేసినట్లుగా పద్మనాభం మరో లేఖను రాశారు.
Also Read: రెండో జాబితా ప్రకటించిన టీడీపీ.. 34 మంది అభ్యర్థులు వీరే!
పెద్ద సంఖ్యలో ర్యాలీగా తాడేపల్లికి వెళితే అక్కడ ఎక్కువ మంది కూర్చోడానికి కాదు, నిలబడటానికి కూడా స్థలం సరిపోదని, వచ్చిన వారందరినీ తనిఖీ చేయటం పోలీసులకు కష్టమవుతుందని, కనుక ర్యాలీని విరమించుకున్నట్లు ఆయన తాజా లేఖలో తెలిపారు. పనిలోపనిగా అభిమానులను నిరుత్సాహపర్చినందుకు క్షమాపణలు కూడా చెప్పారు. మార్చి 15, 16 తేదీల్లో తాను ఒక్కడినే తాడేపల్లి వెళ్లి సీఎం సమక్షంలో పార్టీలో చేరతానని తెలియజేశారు.
అయితే.. తమ అభిమాన నేత ముద్రగడను ర్యాలీగా రావటం ఇష్టంలేని కొందరు వైసీపీ నేతలు.. భద్రత పేరుతో తమ ర్యాలీని రద్దు చేయించారని ముద్రగడ అభిమానులు మండిపడుతున్నారు. ముందుగా నిర్ణయించిన తమ కార్యక్రమాన్ని కాదని మార్చి 14న సీఎం జగన్ కర్నూల్, నంద్యాల పర్యటన ఎలా పెట్టుకుంటారని, చూస్తుంటే ఇదంతా కావాలనే తమ అభిమాన నేతను అవమానించేందుకు జరుగుతున్న కుట్రగానూ వారు అభివర్ణిస్తున్నారు. ఇంతకూ తమ నేతను కలిసే సమయంలో సీఎం జగన్ కనీసం కుర్చీ అయినా వేస్తారా లేక బయటే నిలబెట్టి కండువా కప్పి బయటి నుంచి బయటే పంపేస్తారా అని ముద్రగడ అభిమానులు మండిపడుతున్నారు.