TG Government Key Decisions on Schemes(Breaking news in telangana): తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అమలు చేసే పథకాలకు, ఎమ్మెల్యేలకు లింక్ పెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను పూర్తిగా అధికారులకే అప్పగించాలని భావిస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టే పలు పథకాలకు నిజమైన అర్హులకు అందించేందుకు ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిరి పథకాలకు అర్హుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించొద్దని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి విధివిధానాలు రూపొందించాలని చెప్పినట్టు తెలిసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసిన గ్యారంటీలకు అర్హులను ప్రజాప్రతినిధుల ద్వారా ఎంపిక చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇకపై ఇందిరమ్మ ఇండ్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు, ఇతర సబ్సిడీ పథకాల అమలుకు క్షేత్రస్థాయిలో అర్హులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. వాళ్లను కేవలం పంపిణీ కార్యక్రమాలకే పరిమితం చేయాలని ఆలోచిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా పథకాలకు అర్హుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో అర్హుల ఎంపిక బాధ్యత అధికారులకే ఇస్తే ప్రభుత్వానికి పేరు రావడంతో పాటు నిజమైన అర్హులకే మేలు జరుగుతుందని ప్రభుత్వ ఆలోచన.
Also Read : భూదాన్ భూముల అక్రమాలపై టీఎస్ సర్కార్ కొరడా.. మైహోమ్, కీర్తి సిమెంట్స్ కు నోటీసులు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను ఎమ్మెల్యేలకు లింక్ చేసింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత బంధు, బీసీ, మైనార్టీలకు లక్ష ఆర్థిక సాయం వంటి వాటన్నింటికీ అర్హుల ఎంపికను ఎమ్మెల్యేలకు అప్పగించింది. దాంతో తమనూ అర్హులుగా చేర్చాలని కోరుతూ.. నియోజకవర్గాల ప్రజలు ఆయా ఎమ్మెల్యేల చుట్టూ తిరిగారు. ఎమ్మెల్యే పేరు రాసిస్తేనే వారికి స్కీమ్ అందేది. దీంతో నిజమైన అర్హులకు కాకుండా.. పార్టీ కార్యకర్తలు, లీడర్లు, వాళ్ల బంధువులను ఎమ్మెల్యేలు ఎంపిక చేశారు. పథకాల అమలులో కొద్దిమంది కార్యకర్తలకే మేలు జరగడం, కొందరు ఎమ్మెల్యేలు దళితబంధు అమలులో కమీషన్లు తీసుకోవడం లాంటివి నాటి ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తెచ్చాయి. దీంతో ఆ విధానానికి స్వస్తి చెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రకటించిన 5 గ్యారెంటీల అమలుకు ప్రజల నుంచి తీసుకున్న దరఖాస్తులు, రేషన్ కార్డుల ఆధారంగా పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హుల ఎంపిక మొత్తం అధికారులతోనే పూర్తి చేయించనుంది. ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, 5 వందల రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, యువ వికాసం సహా ఏ పథకమైనా పేదలకు అందించే బాధ్యతను ఇందిరమ్మ కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో అధికారులతో పని చేసి అర్హులను గుర్తించేందుకు సహకరిస్తాయని అనుకుంటున్నది. ఈ కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఇక మహిళా సంఘాలను అన్ని రకాలుగా యాక్టివేట్ చేస్తున్న ప్రభుత్వం.. పథకాల అమలులోనూ వారిని భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది.