Common Capital for Telugu States(Latest news in Andhra Pradesh): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచేలా చట్టం తీసుకురావాల్సిందిగా కేంద్ర హోం శాఖను ఆదేశించాలని దాఖలైన పిల్ ను హై కోర్టు కొట్టివేసింది. ఉమ్మడి రాజధానిపై పార్లమెంట్ ను ఎలా ఆదేశించగలమని హై కోర్టు ప్రశ్నించింది. తమకు కూడా కొన్ని పరిమితులుంటాయని, రాజధాని అంశంపై ఆదేశాలు ఇవ్వడం పిల్ వేసినంత సులువు కాదని వ్యాఖ్యానించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : గీతాంజలి మరణంపై పాలిటిక్స్.. వైసీపీ-టీడీపీ మధ్య సోషల్ మీడియా యుద్ధం.. అసలు తప్పెవరిది ?
ఏపీ విభజన చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం.. రెండు రాష్ట్రాల మధ్య ఇంకా అప్పులు, ఆస్తులు, కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తి కాలేదని.. హైదరాబాద్ ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరుతూ ఇబ్రహీంపట్నంకు చెందిన ప్రజాసంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ హైకోర్టులో వేసిన పిల్ బుధవారం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించి.. ఈ ఏడాది జూన్ 2 నాటికి పదేళ్లు పూర్తవుతాయని, అప్పులు, ఆస్తుల విభజన పూర్తయ్యేవరకూ మరో పదేళ్లు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్నారు. ఇదంతా విన్న ధర్మాసనం ఈ వ్యవహారంపై చట్టం చేసేలా పార్లమెంట్ ను ఆదేశించలేమని పేర్కొంటూ.. పిటిషన్ ను కొట్టివేసింది.