PM Modi Election Campaign in Hyderabad(Political news in telangana): హైదరాబాద్ వేదికగా ప్రధాని నరేంద్రమోదీ లోక్ సభ ఎన్నికలకు శంఖారావాన్ని పూరించనున్నారు. రేపో మాపో ఎన్నికల్ షెడ్యూల్ విడుదల కానుందన్న సంకేతాల నేపథ్యంలో.. మల్కాజ్ గిరిలో శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి.. మరోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోన్న బీజేపీ.. హైదరాబాద్ లో మల్కాజ్ గిరి స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
సికింద్రాబాద్ సిట్టింగ్ స్థానం సహా మల్కాజ్ గిరి, చేవెళ్ల, హైదరాబాద్ స్థానాలపై ఫోకస్ పెట్టింది కమలదళం. వరుసగా జాతీయ నేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. రెండ్రోజుల క్రితం హోంమంత్రి అమిత్ షా నగరంలో పర్యటించగా.. 10 రోజుల వ్యవధిలోనే ప్రధాని మోదీ రెండవసారి రాష్ట్రానికి వస్తుండటం గమనార్హం. నగర శివార్లలోని పటాన్ చెరులో జరిగిన బహిరంగ సభలో మోదీ ఇటీవలే పాల్గొన్న విషయం తెలిసిందే.
లోక్ సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. నగర ఓటర్లను ఆకట్టుకునేందుకు రోడ్ షో లు నిర్వహిస్తోంది. శుక్రవారం మల్కాజ్ గిరిలో సుమారు 5 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనుంది. ఈ రోడ్ షో లో ప్రధాని నరేంద్రమోదీ పదేళ్లలో జరిగిన పాలన, కేంద్రం ప్రవేశ పెట్టిన పథకాలు, సాధించిన విజయాలు, చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించారు.
Also Read: Modi’s Operation South: మోదీ ఆపరేషన్ సౌత్..130 లోక్ సభ సీట్లే లక్ష్యం
శుక్రవారం సాయంత్రం రాష్ట్రానికి రానున్న ఆయన.. రెండ్రోజులు పర్యటించనున్నారు. సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో ప్రధాని చేరుకోనున్నారు. రోడ్డుమార్గం ద్వారా సాయంత్రం 5.15 నుంచి 6.15 గంటలకు చేరుకొని మల్కాజిగిరి నియోజకవర్గంలోని మిర్జాలగూడలో 1.2 కిలోమీటర్ల మేర నిర్వహించే రోడ్ షోలో బీజేపీ ముఖ్యనేతలతో కలిసి ఆయన పాల్గొననున్నారు. అనంతరం రాజభవన్కు చేరుకొని రాత్రి అక్కడే బస చేయనున్నారు.
కాగా.. ప్రధాని నరేంద్రమోదీ రోడ్ షో నేపథ్యంలో మీర్జాల్ గూడ నుంచి మల్కాజ్ గిరి క్రాస్ రోడ్డు వరకూ 5 కిలోమీటర్ల మేర పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో ఎయిర్ క్రాఫ్ట్ లను ఎగురవేసేందుకు అనుమతి లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆదేశించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్ 188, 121, 121(ఏ), 287, 336, 337, 338 కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.