Social War on Geetanjali Death(AP latest news): ఏపీలో ఎన్నికల యుద్ధం ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కింది. ఇప్పటికే టీడీపీ, వైసీపీ మధ్య ఓ రౌండ్ సోషల్ మీడియా వార్ ముగిసింది. అప్పట్లో మహిళా నేతలే టార్గెట్ గా రెండువైపుల నుంచి కౌంటర్లు ఎన్ కౌంటర్లు నడిచాయి. ఇవి ఎవరు నడిపించారు.. ఎందుకు నడిపించారన్న విషయాలు పక్కన పెడితే కొందరి అత్యుత్సాహంతో చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి సోషల్ మీడియా పోస్టులతో వస్తోంది. ఇప్పుడు గీతాంజలి అనే వివాహిత మృతి ఏకంగా తీవ్ర దుమారమే సృష్టిస్తోంది. మరోసారి రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కు కారణమవుతోంది.
ఏపీలో ఎన్నికలు సజావుగా సాగితే మజా ఏం వస్తుందనుకుంటున్నారో ఏమోగానీ.. సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ మధ్య డైలాగ్ వార్, క్యారెక్టర్ హసాసినేషన్ విపరీతంగా జరుగుతోంది. రెండు పార్టీల్లోని కొందరి అత్యుత్సాహమో తెలియదు.. మరేంటోగానీ.. రాజకీయాల కోసం ఇంతగా దిగజారాలా అని సామాన్య జనం అనుకునే పరిస్థితి తలెతుత్తోంది. ఇవాళ్టి సోషల్ మీడియా యుగంలో ఏదైనా వైరల్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటోంది. ఇదే అదునుగా అసత్యాలు, ఆరోపణలు, క్యారెక్టర్స్ పై ట్రోలింగ్ చేస్తూ రెండువైపుల నుంచి సోషల్ మీడియాలో దాడులు జరుగుతున్నాయి.
ఒక విషయాన్ని ఎన్నిరకాలుగా ఏమార్చాలో సోషల్ మీడియా చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియా యుద్ధమే జరుగుతోంది. తెనాలికి చెందిన గీతాంజలి అనే వివాహిత మరణం చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయం తిరుగుతోందంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఆమె చావుకు కారణం మీరంటే మీరే అంటూ వైసీపీ-టీడీపీ నేతలు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. జగనన్న ఇల్లు అందించడం సంతోషమని చెప్పడం, ఆ వీడియోతో ట్రోల్స్ చేయడంతోనే రైలు కింద పడి సూసైడ్ చేసుకుందని వైసీపీ నేతలు.. కాదు కాదు.. ఆమెను ఎవరో రైలుకింద నెట్టేశారని టీడీపీ ఇలా కౌంటర్ వార్ నడుస్తూనే ఉంది.
Also Read :హైదరాబాద్ మరో బెంగళూరు కాకూడదు.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరిక
నిజం ఏంటన్నది ఎప్పటికైనా బయటపడడం ఖాయం. తప్పు ఎవరిది అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఏపీ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా ఎలా దుర్వినియోగం అవుతుందో ఈ గీతాంజలి కథ విషాదాంతమే నిదర్శనం. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకం వచ్చింది. లబ్దిదారుల్లో ఒకరిగా గీతాంజలి మార్చి 4న తెనాలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంటి పట్టా అందుకున్నారు. ఆమె తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. ఇక్కడితో కథ ఆగిపోతే బాగుండేది. కానీ ట్రోల్స్ మొదలయ్యాయని, ఆ ఆవేదనతోనే చనిపోయినట్లుగా ఒక వెర్షన్ ప్రచారంలో ఉంది. అయితే గీతాంజలికి రైలు యాక్సిడెంట్ మార్చి 7వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగిందని, ట్రోల్స్ మార్చి 8, 9 తేదీల నుంచి మొదలయ్యాయని మరో వెర్షన్ వినిపిస్తోంది. ఒకవేళ ట్రోలింగ్ వల్లే చనిపోయి ఉంటే ముందే ఎలా సూసైడ్ చేసుకుంటుందన్న వాదనను వినిపిస్తున్నారు. ఈ ఇష్యూలో రోజుకో కొత్త వీడియో తెరపైకి వస్తోంది. ఇప్పుడిదే ఇదే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎవరో ఇద్దరు తోసేశారంట అన్న మాటలు వీడియోలో వినిపిస్తున్నాయి. అయితే ఈ వీడియో క్రెడిబులిటీ ఎంతన్నది కూడా తేలాల్సి ఉంది.
నిజానికి ఏపీలో సోషల్ మీడియా వార్ ఎప్పుడో హద్దులు దాటిపోయింది. ఇందులో విజేతలుగా ఎవరూ మిగలలేదు. అందరూ బాధితులే. ముఖ్యంగా మహిళల క్యారెక్టర్ టార్గెట్ గా జరిగిన పోస్టింగ్ లు సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేశాయి. కొందరి అత్యుత్సాహం రెండు వైపులా నష్టాన్నే మిగులుస్తోంది. వీటితో రాజకీయంగా ఉపయోగం లేకపోగా అన్నీ సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. చెప్పాలంటే సోషల్ మీడియా ఇవాళ్టి రోజుల్లో పవర్ ఫుల్ గా మారింది. విషయం ఏదైనా వైరల్ అయితే.. తక్కువ సమయంలో ఎక్కువ కవరేజ్, స్కోప్ పెరుగుతోంది. ఇదే అదనుగా పైచేయి సాధించేందుకు పట్టు పెంచుకునేందుకు వివాదాస్పద పోస్టింగ్ లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. గతేడాది అయితే ఇటు చంద్రబాబు కుటుంబం, అటు జగన్ కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
ఇప్పుడు తెనాలికి చెందిన గీతాంజలి మృతి చుట్టూ ఏపీ సోషల్ మీడియా రాజకీయం తిరుగుతోంది. అసలేం జరిగిందో.. తప్పు ఎవరిదో దర్యాప్తులో విషయం తేలుతుంది. అయితే అన్యాయంగా జరిగిన ఈ మరణాన్ని ఏ పార్టీ కూడా తమ ఖాతాలో వేసుకోవడానికి సిద్ధం లేదు. అంతా మీరే చేశారు.. మీ వల్లే గీతాంజలి చనిపోయిందని ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. రాజకీయం అంటే ఇంతేనా.. ఇదేనా అన్న పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. అసలే కులాలు వర్గాల సమీకరణాల చుట్టూ తిరిగే ఏపీ ఎన్నికల రాజకీయం.. ఇప్పుడు సోషల్ మీడియాలో వికృత రూపంగా మారింది. ఇప్పుడే ఇలా ఉంటే, ఇక ఎన్నికలు దగ్గర పడ్డాక పరిస్థితి ఇంకెంత డేంజర్ గా మారుతుందోనన్న ఆందోళన కనిపిస్తోంది.
Also Read : మరో నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్..
ఇప్పుడు జస్టిస్ ఫర్ గీతాంజలి అని, #WhoKilledGeetanjali అన్న హ్యాష్ ట్యాగ్ లు నడుస్తున్నాయి. నిండు ప్రాణం బలయ్యాక ఎన్ని చేసి ఏం లాభం. సీఎం జగన్ ఆమె కుటుంబానికి 20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టదని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఆమె ఇద్దరు పిల్లలు తల్లిలేనివారయ్యారు. అటు లోకేష్ కూడా ఈ ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. గీతాంజలితో బలవంతంగా వీడియో రూపంలో అబద్ధాలు చెప్పించారని, ఆమె 7వ తేదీన ప్రమాదానికి గురి అయిందో, ఆత్మహత్యాయత్నం చేసిందో తెలియదుగానీ.. తీవ్రంగా గాయపడితే మెరుగైన చికిత్స కూడా అందించే ప్రయత్నం కూడా చేయలేదంటూ ట్వీట్ చేశారు. చనిపోతే మాత్రం ఆ మృతదేహంతో కన్నింగ్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రతి ఎన్నికల ముందు నరబలి జరగాల్సిందేనా అన్న పోస్టర్ ను ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఏపీలో రాజకీయాలకు మహిళలే మొదటి టార్గెట్ అవుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ విపరీత ధోరణి మరింతగా పెరిగింది. సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థుల్ని మానసికంగా కుంగదీయడం, క్యారెక్టర్ హసాసినేషన్ చేయడం పరిపాటి అయింది. చివరకు అటు సీఎం జగన్, ఇటు చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా ట్రోలింగ్ బాధితులుగా మిగిపోయారు. ఈ పరిస్థితి మారాలి అంటే గట్టి సంకల్పం ఉండాలి. రెండువైపులా సోషల్ మీడియా వ్యవస్థలను కంట్రోల్ చేస్తేగానీ పరిస్థితి దారికి వచ్చేలా కనిపించడం లేదు.