TG High Court Warns State Government : ఐటీ హబ్ బెంగళూరు సిటీలో తాగునీటి సమస్య రోజురోజుకి దారుణంగా మారుతోంది. ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే నీళ్లు ఎటూ సరిపోవడం లేదని ప్రజలు గగ్గోలుపెడుతున్నారు. నెలకు అయిదుసార్లు మాత్రమే స్నానం చేస్తున్నారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది. దీంతో ఐటీ కంపెనీలు కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం కాదు, ఎవరిళ్ళకు వారు వెళ్లిపోండి. సీటీలో జనాభా ఖాళీ అయితేకానీ నీటి సమస్య తీరేట్టు లేదని మొరపెట్టుకుంటున్నాయి.
భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోవడంతో బెంగళూరు ప్రజలు ప్రతి ఒక్క నీటి బొట్టును జాగ్రత్తగా వాడుకుంటున్నారు. ఎక్కువమంది ఇంట్లో వంట చేయకుండా, బయటినుంచి ఆర్డర్లు పెట్టుకుని తెప్పించుకుంటున్నారు. ఉన్న కొద్ది నీరు వృథా కాకుండా.. వాడిన నీటినే మళ్లీ రీ సైక్లింగ్ చేసుకుని వాడుకునే దుర్భర పరిస్థితుల్లో దైనందిన జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. దాదాపు మూడు నెలల నుంచి బెంగళూరులో ఇదే పరిస్థితి. రోజూ 2600 నుంచి 2800 మిలియన్ లీటర్ల నీరు అవసరం కాగా, ప్రస్తుత నీటి సరఫరా దీనిలో సగం కూడా ఉండడం లేదు.
బెంగళూరులో ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. వాటర్ ట్యాంకర్ల ధరలను కూడా నియంత్రించింది. నీటి ధరలు అదుపులో ఉన్నప్పటికీ సకారలంలో ట్యాంకర్లు రావడంలేదని, వచ్చినా చాలీచాలని నీళ్లే ఉంటున్నాయని ప్రజలు తెలిపారు. గత 15 ఏళ్లుగా భవన నిర్మాణాలపై పెట్టిన శ్రద్ధ భూగర్భ జలాలపై పెట్టి ఉంటే నేడు ఈ పరిస్థితి దాపురించేది కాదని స్థానికులు పేర్కొన్నారు. మళ్ళీ సాధారణ జీవితం ఎన్నాళ్ళకొస్తుందో తెలియని గందరగోళం నెలకొందని వారంటున్నారు. ఇదీ.. ప్రస్తుతం బెంగళూరులో నెలకొన్న పరిస్థితి.
Also Read: మహిళలకు కాంగ్రెస్ హామీల వర్షం.. ఏడాదికి లక్షరూపాయలు, ఉద్యోగాల్లో 50 శాతం కోటా
హైదరాబాద్ బెంగళూరులో వచ్చిన పరిస్థితి రాకుండా చూడాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇంకుడు గుంతలు, ఆర్ డబ్ల్యూఎస్ హెచ్ పై సరైన చర్యలు తీసుకోకపోతే.. బెంగళూరు మాదిరి ఇక్కడ కూడా తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి వస్తుందని హెచ్చరించింది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇంకుడు గుంతలు లేవో.. వాటిని గుర్తించి సరైన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు కూడా నీటి వినియోగంపై అవగాహన కల్పించి.. నీటి అవసరాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని సూచించింది.
తెలంగాణ వ్యాప్తంగా నీటి కొరత ఉందని, ప్రధానంగా జంటనగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ లలో తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తోందని, అధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని జర్నలిస్ట్ సుభాష్ చంద్రన్ 19 ఏళ్ల క్రితం లేఖ రాయగా.. దానిని న్యాయస్థానం పిటిషన్ గా మార్చి సుమోటోగా విచారణకు స్వీకరించింది. దీనిపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ అన్ని అంశాలను పరిశీలించి హైకోర్టుకు కొన్ని కూలక సూచనలతో కూడిన నివేదికను సమర్పించింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం దీనిపై మరోసారి విచారణ చేపట్టగా.. ఈ పిటిషన్ కు కాలం చెల్లిపోయిందని పీపీ సిద్ధివర్ధన పేర్కొన్నారు. నీటిఎద్దడిని ఎదుర్కొనే చర్యలు చేపట్టాలని, అందుకు పిటిషన్ కాలం చెల్లిందన్న వాదన సరికాదని పేర్కొన్న ధర్మాసనం.. నీటి కరవు పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ.. తదుపరి విచారణను మార్చి 26కు వాయిదా వేసింది.