4 MP Candidates List Released by BRS Party: లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండగా.. ఒక్కొక్క పార్టీ తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉండగా.. బీజేపీ ఇప్పటికే 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్, ఖమ్మం స్థానాల్లో అభ్యర్థులను మాత్రం పెండింగ్ లో ఉంచింది. ఇక తాజాగా బీఆర్ఎస్ మరో నలుగురు ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరితో కలిపి ఇప్పటి వరకూ బీఆర్ఎస్ 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది.
చేవెళ్ల, వరంగల్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్యను కేసీఆర్ అనౌన్స్ చేశారు. స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి కుమార్తెనే కడియం కావ్య. ఇక అసెంబ్లీ ఎన్నికల ముందువరకు టీటీడీపీ అధ్యక్షునిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మరోసారి పోటీ చేసేందుకు సిద్ధంగా లేకపోవడంతో కాసాని జ్ఞానేశ్వర్ కు అవకాశమిచ్చింది అధిష్ఠానం.
అలాగే.. జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేశారు. జహీరాబాద్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ క్యాండిడేట్ గా బాజిరెడ్డి గోవర్దన్ ను కన్ఫర్మ్ చేశారు. గత లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కల్వకుంట్ల కవిత ఎంపీగా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు సీటు ఇవ్వకపోవడంతో.. లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దింపుతారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్థన్ ను ప్రకటించడంతో.. కవిత ఎక్కడి నుంచి పోటీచేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
Also Read: 72 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా విడుదల.. తెలంగాణ నుంచి ఆరుగురు ఖరారు
మిగిలిన 8 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు కేసీఆర్. లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేస్తున్న బీఆర్ఎస్.. ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లోక్ సభకు పోటీ చేసే అవకాశం ఉండటంతో.. ఆయన ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారన్న దానిపై స్పష్టత వచ్చాక మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకూ బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం – నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ (ఎస్టీ) – మాలోతు కవిత, కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి (ఎస్సీ)- కొప్పుల ఈశ్వర్, మహబూబ్ నగర్ – మన్నె శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల – కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ (ఎస్సీ)- డాక్టర్ కడియం కావ్య, జహీరాబాద్ – గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్థన్