Share Market Crashed Today : స్టాక్ మార్కెట్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. బుధవారం దేశీయంగా భారీ కుదుపుకు గురయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివరికి 900 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఇదే సమయంలో నిఫ్టీ 22 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. రిలయన్స్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ వంటి షేర్ల అమ్మకాలు సూచీల పతనానికి కారణమయ్యాయి. సెబీ చీఫ్ వ్యాఖ్యల కారణంగా స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోక తప్పలేదు. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 5 శాతం, మిడ్ క్యాప్ 4 శాతం నష్టపోవడంతో.. మదుపరుల సంపద దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైంది. వీటి మార్కెట్ విలువ రూ.372 లక్షల కోట్లకు చేరింది.
బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్.. 11 గంటల తర్వాతి నుంచి పతనమవుతూ వచ్చింది. ఇంట్రాడేలో 72,515.71 వద్ద కనిష్ట సూచీని తాకి.. చివరికి 906.07 పాయింట్ల నష్టంతో 72,761.89 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 338 పాయింట్ల నష్టంతో 21,997.70 వద్ద స్థిరపడింది. డాలర్ తో పోలిస్తే.. రూపాయి మారకం విలువ 85.85గా నమోదైంది.
ఇక సెన్సెక్స్ 30లో ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, కోటక్ మహీంద్రా, నెస్లే ఇండియా షేర్లు మాత్రం లాభపడ్డాయి. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా స్టీల్, టాటా మోటార్స్, జేఎస్ డబ్ల్యూ స్టీల్ మాత్రం నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2,163 డాలర్ల వద్ద ట్రేడవ్వగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 82.98 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
Also Read: మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లో డబ్బును తీయొచ్చా ? ఈ విషయాలు మీకోసం..
సెబీ చాఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను కొన్ని బ్రోకరేజీ సంస్థలు, ఇన్వెస్టర్లు సమర్థించడం స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని పెంచింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ.. తాజాగా వేసిన అడుగు కూడా మార్కెట్ల పతానానికి కారణమైంది.
దుబాయ్ కు చెందిన హవాలా ఆపరేటర్ హరిశంకర్ టైబర్ వాలా డీ మ్యాట్ ఖాతాల్లో ఉన్న రూ.1100 కోట్లను ఈడీ సీజ్ చేసింది. ఇది కూడా స్టాక్స్ అమ్మకాలపై ఒత్తిడి తెచ్చింది.