Chandrababu Naidu Speech about Elections 2024: డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని చంద్రబాబునాయుడు అన్నారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలలకు రెక్కలు అనే కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. టీడీపీ హయాంలోనే ఉద్యోగాలు, కళాశాల సీట్లలో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు తీసుకొచ్చామన్నారు. ఆడబిడ్డలకు రిజర్వేషన్లతో ప్రస్తుతం మగవారితో సమానంగా పనిచేస్తున్నారని, ఇలాంటి అవకాశాలను మరిన్ని ఇస్తే ఇంకా ముందుకెళ్తారన్నారు. ఆడబిడ్డల ఉజ్వల భవిష్యత్ కోసం ఆలోచించి.. వాటిని అమలు చేసే ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. పిల్లల భవిష్యత్తుకై టీడీపీ హయాంలో తీసుకొచ్చిన పథకాలతో ఎంతోమంది విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారని తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాగానే మహాశక్తి కింద 5 కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. తల్లికి వందనం పేరుతో ఏడాదికి రూ.15 వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వచ్చాయంటే.. అదంతా సీనియర్ ఎన్టీఆర్ చొరవేనని కొనియాడారు. గతంలో టీడీపీ హయాంలో 22 కొత్త పథకాలు తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు చంద్రబాబు నాయుడు. ఐటీ గురించి ఒకప్పుడు తాను మాట్లాడితే అంతా నవ్వారని, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఐటీ సెక్టార్లలో అధికశాతం మనవాళ్లే ఉన్నారని గర్వంగా చెప్పారు.
ఆడపిల్లల్లో నైపుణ్య అభివృద్ధి కోసం ఎంతైనా ఖర్చు చేసే పథకమే కలలకు రెక్కలు పథకమని తెలిపారు. విద్యార్థినుల ఉన్నత చదువుల కోసం బ్యాంకుల్లో రుణాలు తీసుకునే సహకరిస్తామని, వాటికి ప్రభుత్వమే వడ్డీ కడుతుందని వివరించారు. “ప్రజలు గెలవాలి – రాష్ట్రం నిలబడాలి” 2024 ఎన్నికల్లో ఇదే జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రమంతా విధ్వంసమైందని, ఇకనైనా మార్పు రాకపోతే.. మరింత విధ్వంసం తప్పేలా లేదన్నారు. ఆర్థిక సంస్కరణల కారణంగా ఏపీలో పెట్టుబడిదారులు పెరిగారన్నారు.
Also Read: ఈ సారైనా పవన్ గట్టెక్కేనా..? భీమవరం ప్రజలు కాపాడతారా..?
భారత్ లో యువత అధికంగా ఉండటం ఒకింత కలిసొచ్చే అంశమన్న ఆయన.. ప్రధాని మోదీ ఇప్పుడు చెబుతోన్న వికసిత్ భారత్ 2047 నాటికి కచ్చితంగా జరిగి తీరుతుందన్నారు. రాజధానిగా అమరావతి అభివృద్ధి చెంది, పోలవరం పనులు పూర్తయి ఉంటే.. రాష్ట్రాన్ని కొత్త పరిశ్రమలు వచ్చేవని, కొత్త ఉద్యోగాల కల్పన ఉండేదని, రాష్ట్రం అభివృద్ధి చెందేదని పేర్కొన్నారు. విద్యా రాజధానిగా ఎదగాల్సిన రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. ప్రజలు గెలవాలంటే వైసీపీ ఓడి తీరాల్సిందేనని అప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు.