Bangalore Crime News: బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగర శివారులోని చందాపుర హెడ్మాస్టర్ లే అవుట్ నాలుగో అంతస్తులో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగో అంతస్తు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సూర్యనగర పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులు బద్ధలుకొట్టగా కుళ్లిన శవం కనిపించింది. పోలీసులు వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దాదాపు 5 రోజుల క్రితం హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఒడిశాకు చెందిన సపన్ కుమార్ ఆ ఇంట్లో నివసించేవాడని పోలీసులు గుర్తించారు. అతడితో కలసి ఆమె ఉండేదని అనుమానం వ్యక్తం చేశారు. ఆమె మృతదేహం పక్కన మద్యం సీసాలు, సిగరెట్లు, ఫుడ్ ప్యాకెట్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె హత్యకు ముందు వారిద్దరూ మద్యం సేవించి ఉంటారని పేర్కొన్నారు.
సపన్ కుమార్ ఫోన్ అందుబాటులో లేదని, ప్రస్ధుతం పనిచేయడం లేదని పోలీసులు తెలిపారు. తాగిన మత్తులో సపన్ కుమార్ హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.