CM Revanth Reddy Launched Mahalakshmi Swashakti Scheme: తెలంగాణలో మరో సంక్షేమ పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మహలక్ష్మి స్వశక్తి పథకాన్ని ప్రారంభించారు. మహిళా సంఘాల కోసం 100 మార్కెట్లు నిర్మిస్తామని తెలిపారు. ఉత్పత్తులు విక్రయించుకునేందుకు స్టాళ్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కోటి మంది స్త్రీలను కోటీశ్వరులుగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
మహిళల ఆశీస్సులతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తన పదేళ్ల పాలనలో ఆడబిడ్డలను పట్టించుకోలేదని విమర్శించారు. వారి ఉసురు తగలడం వల్లే కేసీఆర్ సీఎం పదవి పోయిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే కేసీఆర్ ఫ్యామిలికి కడుపుమంటగా ఉందని మండిపడ్డారు. అందుకే ఆటో డ్రైవర్లతో ఆందోళనలు చేయించారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను అన్ని విధాలా ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. కేసీఆర్ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తే .. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ స్కీమ్ పరిధిని రూ. 10 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు.
బీజేపీపైనా సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేంద్రం రూ. 400గా ఉన్న గ్యాస్ సిలిండర్ల ధరను రూ. 1200కు పెంచేసిందని మండిపడ్డారు. మహిళలపై ఆర్థికభారం తగ్గించేందుకే గ్యాస్ సిలిండర్లను రూ.500కే ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయని మోదీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చిన ప్రధాని 10 ఏళ్లలో 20 కోట్ల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారా ? అని నిలదీశారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి పీఠంపై పాలమూరు బిడ్డ ఉంటే కొందరు ఓర్వలేకపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోదీ, కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
Share