KCR Speech in Karimnagar Public Meeting: సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శ్రీకారం చుట్టారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ కదనభేరి పేరుతో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో గులాబీ బాస్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ అంటే తెలంగాణ బలం.. తెలంగాణ గళం అని పేర్కొన్నారు. కరీంనగర్ లో వినోద్ కుమార్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. 3 నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఆగం చేసిందని మండిపడ్డారు. ఈ పాలన కంటే సమైక్య పాలకులే నయమనిపిస్తోందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుసుంటే దేశాన్ని చైతన్యం చేసేవాణ్ణి అని కేసీఆర్ స్పష్టం చేశారు. తాను గద్దె దిగగానే విద్యుత్ కోతలు మొదలయ్యాయని ఆరోపించారు. రైతు బంధు నిధులు జమకాలేదని విమర్శించారు.
Also Read: 16 కార్పొరేషన్లు ఏర్పాటు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
కాళేశ్వరం ప్రాజెక్టుపైనా కేసీఆర్ స్పందించారు. ఇసుక జారడంతో 2 పిల్లర్లు కుంగితే దేశమే మునిగిపోతోందనే విధంగా వివాదం సృష్టించారని విమర్శించారు. ఒక పన్ను వదులైతే మొత్తం పళ్లు రాలగొట్టుకుంటామా అని ప్రశ్నించారు. రెండు రోజుల్లో మీడియా ముందుకు వస్తానని కేసీఆర్ ప్రకటించారు. కాళేశ్వరంపై వివరాలు వెల్లడిస్తానన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిపైనా కేసీఆర్ విమర్శలు గుప్పించారు. సీఎంను ఆరు గ్యారంటీలు అమలు చేయమని అడిగితే బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు హామీలకు మోసపోయి కాంగ్రెస్ ను గెలిపించారని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి కర్ర కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు.
బీజేపీపై కేసీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. చట్టం ప్రకారం తెలంగాణలో జిల్లాకో నవోదయ పాఠశాలను ముంజూరు చేయాల్సి ఉందన్నారు. కానీ ఒక్కటి కూడా ఇవ్వని కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఓటెయ్యాలని నిలదీశారు. కరీంనగర్ లో బండి సంజయ్ కు ఎందుకు ఓటేయ్యాలని ప్రశ్నించారు. కరీంనగర్ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.