Haryana New CM Nayab Singh Saini: హర్యానాలో రాజకీయ సంక్షోణానికి తెరపడింది. బీజేపీ అధిష్టానం వెంటనే రంగంలోకి దిగడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. హర్యానా కొత్త సీఎంగా కురక్షేత్ర ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాయబ్ సింగ్ సైనీని ఎంపిక చేసింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత సీఎంగా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణం చేయించారు.
సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అనంతరం రాజకీయ పరిణామాలు హీటెక్కాయి. ఎవరికి కొత్త సీఎం పదవి దక్కుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ క్రమంలోనే చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది.
నాయబ్ సింగ్ సైనీ ఓబీసీ వర్గానికి చెందిన వారు. హర్యానాలో ఆ వర్గం జనాభా 8 శాతం వరకు ఉంది. ఈ వర్గం హిస్సార్, కురుక్షేత్ర అంబాలా, రేవాడీ జిల్లాల్లో బలంగా ఉంది. ఆయన మనోహర్ లాల్ ఖట్టర్ కు సన్నిహితుడిగా మెలిగారు.
Also Read: దేశంలో ముస్లిం పౌరులపై CAA ప్రభావం ఉంటుందా ? ముస్లింలకు మాత్రమే ఇది ఎందుకు వర్తించదు ?
నాయబ్ సింగ్ సైనీ 1996లో బీజేపీలో క్రియాకీల రాజకీయాలను ప్రారంభించారు. 2014లో నారాయణ్ గఢ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2016లో మంత్రి పదవిని దక్కించుకున్నారు. అయితే 2019లో లోక్ సభ ఎన్నికల బరిలో దిగారు. కురక్షేత్ర స్థానం ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో 3 లక్షల 83 వేల మెజార్టీ సాధించి సంచలనం సృష్టించారు.
హర్యానాలో బీజేపీ, జేజేపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. అయితే జేజేపీతో మనోహర్ లాల్ ఖట్టర్ కు విభేదాలు రావడంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఖట్టర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. మరోవైపు లోక్ సభ ఎన్నిక మనోహర్ లాల్ ఖట్టర్.. కర్నాల్ స్థానం నుంచి పోటీ చేస్తారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.