T20 వరల్డ్ కప్ లో ఇంటిదారి పడుతుందనుకున్న పాకిస్థాన్ అనూహ్యంగా అదృష్టం కలిసొచ్చి ఫైనల్ చేరితే… ఫైనల్ వెళ్తుందని ఆశలు పెట్టుకున్న టీమిండియా మాత్రం అభిమానులను నిరాశపరిచింది. ఫైనల్లో ఇంగ్లండ్ తో తలపడాల్సి రావడంతో… పాకిస్థాన్ అభిమానులు ఇప్పుడు సంబరపడుతున్నారు. 1992 వరల్డ్ కప్ నాటి పరిణామాలే పొట్టి వరల్డ్ కప్ లోనూ జరిగాయని… పాకిస్థాన్ ఫైనల్లో ఇంగ్లండ్ ను ఓడించడం ఖాయమని అంటున్నారు.
T20 వరల్డ్ కప్లో పాక్ ఆటతీరు చూస్తే… అచ్చం 1992 వన్డే వరల్డ్కప్నే తలపిస్తోంది. ఆస్ట్రేలియాలోనే జరిగిన 1992 వన్డే వరల్డ్కప్లో లీగ్ దశలో భారత్ చేతిలో ఓడిన పాకిస్థాన్… ఇంటిబాట పట్టాల్సిన పరిస్థితుల్లో ఆఖరి రెండు లీగ్ మ్యాచ్ల్లో అద్భుతంగా ఆడి సెమీస్కు చేరింది. ఆ తర్వాత సెమీస్ లో న్యూజిలాండ్తో తలపడి గెలిచి ఫైనల్ చేరింది. ఫైనల్లో ఇంగ్లండ్ను మట్టికరిపించి జగజ్జేతగా నిలిచింది. ఇప్పుడు T20 వరల్డ్ కప్ లోనూ అదే జరిగింది. సూపర్-12 దశలో టీమిండియా చేతిలో ఓడిన పాకిస్థాన్… సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ పై గెలిచింది. కానీ… నెదర్లాండ్స్ పై గెలిస్తే సెమీస్ చేరే ఛాన్స్ ఉన్న సఫారీలు అనూహ్యంగా ఓడిపోవడంతో… అదృష్టం కలిసొచ్చి పాక్ సెమీస్ చేరింది. అచ్చం 1992 వరల్డ్ కప్ లో మాదిరే… సెమీస్ లో కివీస్ పై గెలిచి… ఫైనల్లో ఇంగ్లండ్ తో తలపడేందుకు సిద్ధమైంది. దాంతో… పొట్టి వరల్డ్ కప్ కచ్చితంగా పాకిస్థాన్ కే రాసిపెట్టి ఉందంటున్నారు… అభిమానులు.
అయితే ఇంగ్లండ్ ఫ్యాన్స్ మాత్రం… ఇప్పుడున్న ఫామ్ లో తమ జట్టును ఓడించడం అంత తేలిక కాదంటున్నారు. సెమీస్ లో భారత్ ను చితగ్గొట్టి ఫైనల్ చేరిన ఇంగ్లిష్ టీమ్… పాక్ కు కూడా షాక్ ఇవ్వడం ఖాయమంటున్నారు. మరి పాకిస్థాన్ అభిమానుల సెంటిమెంట్ ప్రకారం ఆ జట్టే కప్ ఎగరేసుకుపోతుందా? లేక ఇంగ్లిష్ ఫ్యాన్స్ ధీమా ప్రకారం బట్లర్ సేన పొట్టి కప్ ను ఒడిసి పడుతుందా? అనేది తేలాలంటే… వచ్చే ఆదివారం వరకు ఆగాల్సిందే.