5 People died in Madhya Pradesh Road Accident: ఎంతో ఆనందంగా, ఘనంగా జరుగుతున్న పెళ్లివేడుకలో ఓ ట్రక్కు తీవ్ర విషాదం నింపింది. పెళ్లి ఊరేగింపు బృందంపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఐదుగురు మృతి చెందగా.. మరో 11 మందికి పైగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్ లోని రాయిసేన్ జిల్లాలో సోమవారం రాత్రి జరిగిందీ ఘటన. హోసంగాబాద్ నుంచి పిపరియా గ్రామానికి జాతీయ రహదారిపై ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లి ఊరేగింపుపైకి అటువైపు వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు జనాలను బలంగా ఢీ కొట్టింది.
Also Read: బస్సుపై తెగి పడిన హైటెన్షన్ వైరు.. ప్రయాణికులు సజీవ దహనం..
సమాచారం అందుకున్న పోలీసులు.. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన 11 మందిలో మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరగవచ్చని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదానికి కారణమైన ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. కాగా.. క్షతగాత్రులు, మృతుల్లో వివాహ వేడుకలకు లైట్లు మోసే కూలీలు కూడా ఉన్నారని సుల్తాన్ పూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రజత్ సారథే తెలిపారు. సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఖమారియా గ్రామానికి సమీపంలో ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాలకు స్థానిక జిల్లా కలెక్టర్ అరవింద్ దూబే రూ.4 లక్షల నష్టపరిహారం, క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం రూ.50 వేలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.