Ramadan 2024: ముస్లింలకు పవిత్రమాసం రంజాన్ సందడి మొదలైంది. భారత్ లో సోమవారం సాయంత్రం నెలవంక కనిపించింది. దీంతో రంజాన్ మాసం మొదలైంది. నెలరోజులపాటు ముస్లింలు ఉపవాస దీక్షలు చేయనున్నారు. అలాగే మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
మంగళవారం వేకువజామున నుంచి రంజాన్ ఉపవాస దీక్షలను ముస్లింలు చేపడతారు. ఈ విషయాన్ని ముస్లిం మత పెద్దలు ప్రకటించారు. రంజాన్ వేళ ఇప్పటికే మసీదులు సుందరంగా ముస్తాబయ్యాయి. అందంగా అలకరించారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
రంజాన్ సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో సందడి వాతావరణం నెలకొంది. రంజాన్ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ లో ముస్లింలు కఠిన ఉపవాస దీక్షలు చేస్తారని పేర్కొన్నారు. ఇది ఆదర్శ జీవనానికి ప్రేరణ ఇస్తుందని తెలిపారు. ఈ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Read More: 14 ఎంపీ సీట్లు గెలుస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి ధీమా..
రంజాన్ వేళ మార్కెట్లు కళకళ లాడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ ఏరియాలో వ్యాపార కూడళ్లలో సందడి కనిపిస్తోంది. చార్మినార్ ప్రాంతంలో మార్కెట్లలో రద్దీ మరింత పెరగనుంది. మరోవైపు అలీమ్ కోసం దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలో అనేక ప్రాంతాలు అలీమ్ అమ్మకాలు మంగళవారం సాయంత్రం నుంచి కొనసాగనున్నాయి. పెద్దపెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలోనూ అలీమ్ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.