APERC on Electricity Bills: ఏపీ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (APERC) గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్న వేళ.. వరుసగా 5వ సంవత్సరం కూడా కరెంట్ ఛార్జీలు పెంచడం లేదని ప్రకటించింది. ఈ విషయాన్ని APERC ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి APERC తీసుకున్న నిర్ణయాలను ఆయన వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో గృహ, వాణిజ్య అవసరాల విద్యుత్ ఛార్జీలను పెంచడం లేదని నాగార్జున రెడ్డి తెలిపారు.
Read More:ప్రేమ పేరుతో ఒకడు.. దెయ్యం పట్టిందని మరొకడు.. మైనర్ పై ఉన్మాదం..
రైల్వే మినహా.. మిగతా వాటికి ఈ ఏడాదిలో ఎలాంటి టారిఫ్ పెంపుదల లేదని వెల్లడించారు. పౌల్ట్రీలు, సగ్గుబియ్యం తయారీ మిల్లులు వంటి వాటికి ఊరటనిచ్చేలా 5 శాతం మేర విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని APERC నిర్ణయించింది. క్రాస్ సబ్సిడీ, వార్షిక ఆదాయ అవసరాలు, టారిఫ్ పెంపు ప్రతిపాదనలను ఏపీలోని మూడు డిస్కమ్ లు విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి. వాటిపై బహిరంగ విచారణతో పాటు స్టాఫ్ అడ్వైజరీ కమిటీ మాట్లాడిన అనంతరం.. 2024-25 టారిఫ్ ఆర్డర్ ను విడుదల చేస్తున్నట్లు APERC చైర్మన్ తెలిపారు. 3 విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.56,573 కోట్ల వార్షిక ఆదాయ అవసరాన్ని ప్రతిపాదించగా.. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి దానిని రూ.56,501 కోట్లకు కుదించిందని వివరించారు.
అలాగే ఇంధన సర్దుబాటు ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలపై చర్చ జరుగుతోందని, ఇంకా ఎలాంటి నిర్మయం తీసుకోలేదని తెలిపారు. వినియోగదారులపై భారం పడకుండా, బహిరంగ మార్కెట్లలో విద్యుత్ కొనుగోళ్ల ప్రభావం పడకుండా ఈఆర్సీ ప్రయత్నించిందని చెప్పుకొచ్చారు. డీబీటీ చెల్లింపుల తర్వాత డిస్కమ్ ల ఆదాయ లోటు రూ.15299 కోట్లుగా ఈఆర్సీ నిర్థారించిందన్నారు. ట్రాఅప్ ఛార్జీలు, ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ మొత్తం కలిపి రూ.13,589 కోట్లు తేలిందని ఈఆర్సీ ఛైర్మన్ తెలిపారు. గతేడాది చెల్లించిన సబ్సిడీ కంటే ఇది రూ.3500 కోట్లు అదనమని చెప్పారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీ చెల్లింపులు ఆలస్యమైనా.. దానిపై వడ్డీలు చెల్లించేలా ఈఆర్సీ ఆదేశించింది. ఇదే సమయంలో గ్రీన్ ఎనర్జీ టారిఫ్ ను రూ.0.75 పైసలకు ఆమోదించింది.