Appointment Of New Election Commissioners: సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా చేయడంతో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. గత నెలలో మరో ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేశారు. దీంతో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషనర్ గా రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. ఈ వారంలోనే లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 15లోపు ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది. ఎన్నికల కమిషనర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది.
సాధారణంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కమిటీ .. కొత్త ఎన్నికల కమిషనర్లను నియమిస్తోంది. ఈ కమిటీలో ప్రధానితోపాటు లోక్ సభలో ప్రతిపక్ష నేత, కేంద్ర మంత్రి సభ్యులుగా ఉన్నారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత అధీర్ రంజన్ చౌధరి, కేంద్ర మంత్రి కొత్త కమిషనర్లు ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలుపుతోంది. 2023లో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును పాటించాలని కోరుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఎన్నికల కమిషనర్ల నియామకంపై మధ్య ప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు జయా ఠాకూర్ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే ఈ నియామకాలు చేపట్టాలని కోరారు.
Read More: రేపటిలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించాలి.. ఎస్బీఐకి సుప్రీం కీలక ఆదేశాలు..
ఎన్నికల కమిషనర్ల నియామకాలపై 2023 మార్చిలో సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. ఈ ప్రక్రియపై పార్లమెంట్ లో చట్టం చేసే వరకు ప్రధాని, లోక్ సభ విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి సీఈసీ, ఈసీలను ఎంపిక చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
2023 డిసెంబర్ లో ఎన్నికల కమిషనర్ల నియామకాలపై కేంద్ర కొత్తం చట్టం అమల్లోకి తీసుకొచ్చింది. ఈసీల ఎంపిక కమిటీలో సీజేఐ స్థానంలో కేంద్ర మంత్రికి స్థానం కల్పించింది. అయితే ఈ చట్టాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఎక్కవగా ఉంటే ఎన్నికల సంఘానికి స్వేచ్ఛ ఉండదని మండిపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశాయి. దీనిపై ఏప్రిల్ లో సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.