CM YS Jagan in Pulivendula: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పులివెందులలో పర్యటిస్తున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి బయల్దేరి ప్రత్యేక హెలికాప్టర్ లో కడప చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో పులివెందుల చేరుకున్న ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. పులివెందులలో నిర్మించిన వైఎస్సార్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైఎస్సార్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిని 51 ఎకరాలలో రూ.500 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు.
ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం.. అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులు, సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలన్నింటినీ నోట్ చేసుకోవాలని ఎంపీ అవినాష్ రెడ్డికి సూచించారు. అనంతరం మెడికల్ కాలేజీ, ఆస్పత్రికి సంబంధించిన వివరాలను వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు సీఎంకు వివరించారు.
అనంతరం బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ను ప్రారంభించారు. రైతులకు ఉపయోగపడే ఈ బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ను రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించింది ప్రభుత్వం. దీనివల్ల అరటి పంట నాణ్యతను పరిశీలించి.. ఎగుమతులు చేసేందుకు వీలుంటుంది. తదుపరి పాత బస్టాండ్ వైఎస్సార్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు.
Read More: వైసీపీలోకి ముద్రగడ.. ముహూర్తం ఫిక్స్..
అక్కడి నుంచి పులివెందుల నియోజకవర్గంలోనే ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఒకే చోట ఉండేలా కాంప్లెక్స్ ను నిర్మించారు. అనంతరం వైఎస్సార్ మెమోరియల్ పార్క్ ను ప్రారంభించారు. ఈ పార్క్ లో రూ.39.13 కోట్ల వ్యయంతో చిల్డ్రన్ పార్క్, గార్డెన్ ను నిర్మించారు.