TMC Announces Candidates for Lok Sabha Polls in West Bengal: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకున్న దీదీ.. రాష్ట్రంలోని 42 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అందులో మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్, ప్రస్తుత ఎంపీ మహువా మొయిత్రా పేర్లు కూడా ఉన్నాయి. మొత్తం 8 మంది సిట్టింగ్ ఎంపీలకు తిరిగి దక్కలేదు. టికెట్ దక్కని వారిలో ఎంపీ నుస్రత్ జహాన్ కూడా ఉన్నారు.
బహరామ్పుర్ నుంచి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ బరిలో దిగనున్నారు. హుగ్లీ నుంచి నటి రచనా బెనర్జీకి అవకాశం కల్పించారు. ఆమె తెలుగులో బావగారు బాగున్నారా..?తో పాటు మూవీస్లో హీరోయిన్గా నటించారు. ఇక అవినీతి ఆరోపణలపై పార్లమెంటు సభ్యత్వం కోల్పోయిన మహువా మొయిత్రా మరోసారి కృష్ణానగర్ నుంచి పోటీ చేయనున్నారు.
ఉత్తర్ప్రదేశ్లో ఒక స్థానం నుంచి పోటీకిగానూ సమాజ్వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్తో చర్చలు జరుపుతున్నట్లు మమతా తెలిపారు. అస్సాం, మేఘాలయాలోనూ పోటీ చేస్తామన్నారు.
లోక్సభ ఎన్నికల కోసం పశ్చిమబెంగాల్లో ఎవరితోనూ పొత్తులు లేవని మమతాబెనర్జీ స్పష్టం క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 42 పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీఎంసీ అభ్యర్థులు పోటీలో ఉంటారన్నారు. అదేసమయంలో మమతాబెనర్జీ ఆదివారం లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో మెగా ర్యాలీ ద్వారా మమతా బెనర్జీ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు.
దీదీ ర్యాలీకి రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మందిని టీఎంసీ సమీకరించింది. కేంద్ర ప్రభుత్వం బెంగాల్కు బకాయిలు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందంటూ ఫైర్ అయ్యారు. బెంగాలోని 42 స్థానాల్లో బీజేపీని ఓడించి తీరుతామని దీదీ శపథం చేశారు.