Mudragada Padmanabham To Join YSRCP(AP Politics): కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. తాడేపల్లి వేదికగా ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు.
తాను వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నానని స్వయంగా ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. అలాగే తన కుమారుడు గిరి కూడా వైసీపీలోకి వస్తారని వెల్లడించారు. తాను పదవులు ఆశించడంలేదని ముద్రగడ స్పష్టం చేశారు. వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తానని తెలిపారు.
ముద్రగడను పార్టీలోకి తీసుకొచ్చేందుకు కొంతకాలంగా వైసీపీ నేతలు చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఆయన ఫ్యాన్ కిందకు రావడం ఖాయమని తేలిపోయింది. ఇటీవల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ , రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లారు. ఆయనతో చర్చలు జరిపారు. వైసీపీలో చేరాలని ఆహ్వానించారు. ఈ చర్చలు సానుకూలంగా జరిగాయి. ముద్రగడ వైసీపీ కండువా కప్పుకునేందుకు సముఖత వ్యక్తం చేశారు.
Read More: చిలకలూరిపేటలో టీడీపీ, బీజేపీ, జనసేన బహిరంగ సభ.. హాజరుకానున్న మోదీ..
తాడేపల్లిలో మార్చి 14న ముద్రగడ వైసీపీలో చేరనున్నారు. ఆయనను పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించుతారని తెలుస్తోంది. ప్రస్తుతం పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా పెండెం దొరబాబు ఉన్నారు. అయితే కాకినాడ ఎంపీ వంగా గీతకు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆమెకు ఇచ్చిన బాధ్యతలు మారుస్తారని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఆమె కూడా స్పందించారు.
ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి చేరనుండటం పిఠాపురంలో ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇక్కడ నుంచే జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలోకి దిగుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ జనసేనాని పిఠాపురంలో పోటీ చేస్తే ముద్రగడను వైసీపీ బరిలోకి దించాలని భావిస్తుందని తెలుస్తోంది.