TDP Janasena BJP Alliance: టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు పొడిచింది. అలాగే సీట్ల లెక్కలు తేలిపోయాయి. ఏ పార్టీ ఏఏ స్థానాల్లో పోటీ చేస్తుందనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మూడు పార్టీలు పోటీ చేసే స్థానాలపై మార్చి 14 నాటికి స్పష్టత వస్తుందని అంటున్నారు. అదే సమయంలో అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని తెలుస్తోంది.
పొత్తును కొలిక్కి తెచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఇరు పార్టీల అధినేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో రెండు సార్లు చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలించాయి. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై అవగాహన కుదిరింది.
జనసేన, బీజేపీ కలిపి 30 అసెంబ్లీ స్థానాలు, 8 లోక్ సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి దించనున్నాయి. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో బీజేపీ, జనసేన నిర్ణయిస్తాయి. బీజేపీ సంయుక్త కార్యదర్శి శివ ప్రకాశ్ జీ సోమవారం విజయవాడ రానున్నారు. ఆయన తొలుత జనసేనానితో చర్చిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత చంద్రబాబుతో కూడా భేటీ అవుతారని సమాచారం.
Read More: వైసీపీని వణికిస్తున్న తాజా సర్వే..
తొలుత టీడీపీ , జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై అవగాహన కుదిరింది. జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్ సభ సీట్లను టీడీపీ కేటాయించింది. అందులో 5 స్థానాలకు అభ్యర్థులను పవన్ కల్యాణ్ ప్రకటించారు. టీడీపీ 94 స్థానాల అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే ఇప్పుడు బీజేపీ, జనసేనకు కలిపి 30 స్థానాలను చంద్రబాబు కేటాయించారు. అంటే బీజేపీ 6 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ చేయనుంది. కానీ ఆ పార్టీ మరిన్ని స్థానాలు కోరుకుంటే జనసేన సీట్లను తగ్గించుకుంటుందని తెలుస్తోంది.
బీజేపీ, జనసేనకు కలిపి 8 లోక్ సభ స్థానాలను చంద్రబాబు కేటాయించారు. అయితే గతంలో జనసేనకు 3 ఎంపీ సీట్లు ఇచ్చారు. అంటే బీజేపీ 5 స్థానాలు కేటాయించారు. కానీ బీజేపీ 6 స్థానాలు కోరుకుంటుందని తెలుస్తోంది. దీంతో జనసేన ఒక లోక్ సభ స్థానాన్ని బీజేపీకి త్యాగం చేస్తుందంటున్నారు.
మరోవైపు ప్రచారంలో దూసుకుపోయేందుకు మూడు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.
చిలకలూరిపేటలో బహిరంగ సభను మార్చి 17న నిర్వహించాలని టీడీపీ, జనసేన నేతలు తొలుత భావించారు. అయితే బీజేపీతోనూ పొత్తు కొలిక్కి రావడంతో మూడు పార్టీల అగ్రనేతలు ఈ సభలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ టూర్ షెడ్యూల్ బట్టి ఈ సభ ఎప్పుడు జరుగుతుందో తేలనుంది. మార్చి 17 లేదా 18న బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది.