IND vs ENG 5th Test Highlights ( live sports news ): టీమ్ ఇండియా విజయ యాత్ర కొనసాగింది. ఇంగ్లాండ్ తో ధర్మశాలలో జరుగుతున్న చివరి టెస్టులో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ని మట్టి కరిపించింది. మూడో రోజే మ్యాచ్ ని ముగించింది. 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.
8 వికెట్ల నష్టానికి 423 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా మరో 54 పరుగులు జోడించి చివరి రెండు వికెట్లు కోల్పోయింది. కులదీప్ (30), బుమ్రా (20) పరుగులు చేసి అవుట్ అయ్యారు. చివరికి టీమ్ ఇండియా 477 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. అలా తొలి ఇన్నింగ్స్ లో 259 పరుగుల ఆధిక్యం లభించింది.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ కి శుభారంభం దొరకలేదు. వారు బజ్ బాల్ విధానంతో ఆడాలని ట్రై చేసి ఎప్పటిలా అవుట్ అయిపోయారు. మొదటి ఇన్నింగ్స్ లో కులదీప్ మ్యాజిక్ చేస్తే, రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ మాయా జాలం పనిచేసింది. తను 5 వికెట్లు తీసి ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. అంతేకాదు త్వరత్వరగా వికెట్లు పడగొట్టాడు.
Read more: 700 వికెట్ల క్లబ్ లో.. తొలి ఫాస్ట్ బౌలర్ గా ఆండర్సన్
జాక్ క్రాలీ ఖాతా తెరవకుండానే డక్ అవుట్ అయ్యాడు. బెన్ డకెట్ 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇలా ఓపెనర్లు ఇద్దరిని అశ్విన్ అవుట్ చేశాడు.
అప్పటికి ఇంగ్లాండ్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 21 పరుగులతో ఉంది. తర్వాత ఫస్ట్ డౌన్ వచ్చిన ఒలి పోప్ (19) కాసేపు ప్రతిఘటించాడు. కానీ అశ్విన్ మాయాజాలంలో చిక్కుకుని అవుట్ అయ్యాడు. ఇలా ఇంగ్లాండ్ తొలి 3 వికెట్లని అశ్విన్ పడగొట్టాడు. మళ్లీ ఇంగ్లాండ్ కోలుకోకుండా చేశాడు. పోప్ అవుట్ అయ్యే సమయానికి 3 వికెట్ల నష్టానికి 36 పరుగులతో ఇంగ్లాండ్ గిలగిల్లాడుతోంది.
ఇక అక్కడ నుంచి క్రమం తప్పకుండా వికెట్లు పడ్డాయి. కానీ జో రూట్ (84) మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. కాసేపు జానీ బెయిర్ స్టో అండగా నిలబడ్డాడు. టీ 20 తరహాలో ధనాధన్ ఆడాడు. 31 బాల్స్ లో 39 పరుగులు చేశాడు. కులదీప్ బౌలింగులో అనూహ్యంగా ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. థర్డ్ అంపైర్ కూడా కాపాడలేకపోయాడు.
తర్వాత వచ్చిన కెప్టెన్ బెన్ స్టోక్స్ (2), బెన్ ఫోక్స్ (8), టామ్ హార్ట్ లీ (20), మార్క్ వుడ్ (0) త్వరత్వరగా అవుట్ అయిపోయారు. సహచరులు అందరూ కళ్ల ముందు వెనుతిరుగుతున్నా జో రూట్ మొక్కవోని ధైర్యంతో ఆడాడు. తను అవుట్ కాగానే ఇంగ్లాండ్ ఓటమి సంపూర్ణమైంది. 195 పరుగులకు అలౌట్ అయ్యింది.
బజ్ బాల్ వ్యూహంతో టెస్ట్ మ్యాచ్ లు ప్రారంభించిన ఇంగ్లాండ్ కి 4-1 భారీ తేడాతో ఓడిపోవడం ఇదే మొదటిసారి. అలాగే బెన్ స్టోక్స్ కి కూడా కెప్టెన్ గా చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ఇండియా బౌలింగులో అశ్విన్ 5, బుమ్రా 2, కుల్దీప్ 1 వికెట్టు పడగొట్టారు.
మొత్తానికి సుదీర్ఘ పర్యటనలో ఇంగ్లాండ్ జట్టు ఇండియా ప్రజలతోను కలిసిపోయింది. అభిమానులతోనూ చిట్ చాట్ చేసింది. గెలుపు ఓటములను పక్కన పెడితే ఒక జంటిల్మేన్ గేమ్ ఆడింది.